Andhra Pradesh: దసరా సెలవుల్లో మహా విషాదం.. ఒకే రోజు నలుగురు చిన్నారుల మృతి.. మరో ఇద్దరికి సీరియస్!

2 hours ago 1

కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు ప్రమాదానికి గురైన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గుంతలో పడి ఒకరు, వంకలో పడి ఒకరు, పురుగుల మందు ఒకరు, పాము కాటుకు గురై ఒకరు చొప్పున చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఒక్క ఎమ్మిగనూరు మండలంలో చోటుచేసుకోవడం విశేషం. వేర్వేరు గ్రామాల్లో జరిగిన ఈ ఘటనల్లో వారసులు శాశ్వతంగా దూరం అవడంతో తల్లిదండ్రులు కుటుంబీకులు కన్నీరు అవుతున్నారు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో వేర్వేరు సంఘటనల్లో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. సంఘటన వివరాల్లోకి వెళ్తే ఎమ్మిగనూరు మండల పరిధిలోని కే.నాగలాపురం గ్రామంలో శనివారం(అక్టోబర్ 5) ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. దసరా సెలవులు కావడంతో ఇద్దరు చిన్నారులు బోయ మహేంద్ర(7), బోయ హరికృష్ణ(5)లు ఆడుకుంటున్నారు. ఇంతలో చేతికి దొరికిన క్రిమిసంహారక మందు డబ్బాలను, కూల్‌డ్రింక్స్‌గా భావించి తీసుకొని అందులోని రసాయనాన్ని ఇద్దరూ సేవించారు.

ఇద్దరు చిన్నారులు అపస్మాకరస్థితిలో ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బీ మహేంద్ర మృతి చెందాడు. మరో బాలుడు హరికృష్ణ చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. అతన్ని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బి.కాసిం, జయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వారి రెండోవ కుమారుడు మహేంద్ర. హరికృష్ణతో కలిసి ఆడుకుంటూ ఉండగా క్రిమిసంహారక మందు డబ్బా దొరకడంతో ఆడుకుంటూ ఇద్దరు కలిసి రసాయనాన్ని సేవించారు. తరువాత కడుపునొప్పి రావడంతో మహేంద్ర ఇంటికి వెళ్లి తల్లి జయలక్ష్మికి చెప్పాడు. హరికృష్ణ తల్లిదండ్రులు అప్పటికే కూలీ పనులకు వెళ్లడంతో ఇద్దరూ దాయాదుల పిల్లలు కావడంతో మహేంద్ర తల్లి జయలక్ష్మి, ఇతరుల సహాయంతో ఇద్దరినీ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహేంద్ర మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

మహేంద్ర(5), హరికృష్ణ(5) ఇద్దరూదాయదుల పిల్లలు. మహేష్, అనసూయ దంపతుల కుమారుడు హరికృష్ణ. శనివారం ఉదయం 7గంటలకే తల్లిదండ్రులు హరికృష్ణకు ఇంటి దగ్గరనే ఉండమని జాగ్రత్తలు చెప్పి, కూలీ పనికి వెళ్లారు. కూలీ పనికి వెళ్లిన వారికి గ్రామస్తులు విషయం తెలపడంతో వారు హుటాహుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. కుమారుని చూసి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య చికిత్స కోసం హరికృష్ణను కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వంకలో పడి సంపత్ కుమార్ మృతి

ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎస్. నాగలాపురం గ్రామానికి చెందిన సంపత్ కుమార్ ప్రమాదవశాత్తు వంకలో పడి మృతి చెందాడు. మాణిక్యరావు, శాంత కుమారి దంపతులకు ముగ్గురు కుమారులు వారిలో చిన్నవాడు ఏడవ తరగతి చదువుతున్న సంపత్ కుమార్ దసరా సెలవుల నిమిత్తం మండలంలోని అమ్మమ్మ ఊరు పార్లపల్లి గ్రామానికి వెళ్లాడు. పార్లపల్లి గ్రామంలో శనివారం ఉదయం బహిర్భూమి కోసం వంక గట్టు వైపు వెళ్ళాడు. బహిర్భూమి అనంతరం కాళ్లు కడుక్కోవడానికి వంకలోకి దిగడంతో, వంకలో గుంత ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు.

నీటి కుంటలో పడి అన్నదమ్ముల మృతి..!

ఇక నందవరం మండలం మాచాపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు నీటి కుంటలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోజువారీగా ఆడుకుంటూ ఎన్టీఆర్ కాలనీలోకి బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు బైరి ఉదయ్ కుమార్ (7) 6వ తరగతి, బోయ అనుమేష్ (5) ఒకటోవ తరగతి చదువుతున్నారు. దసరా సెలవులు కావడంతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడడంతో పక్కన ఉన్న మరో పిల్లాడు గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పిల్లలు ఇద్దరిని వెంటనే నందవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పాము కాటుకు గురైన ఉపేంద్ర

ఎమ్మిగనూరు మండల పరిధిలోని కడివిల్ల గ్రామానికి చెందిన బి.ఉపేంద్ర పాము కాటుకు గురయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బోయ శివ,బోయ పార్వతి ల కుమారుడు బి.ఉపేంద్ర నాలుగవ తరగతి చదువుతున్నాడు.దసరా సెలవులు కావడంతో తల్లిదండ్రులతోపాటు పొలానికి వెళ్ళాడు. పొలం గట్టులపై ఆడుకుంటూ ఉండగా పాము కాటుకు గురయ్యాడు. ఉపేంద్ర పాము కరిచిందని తల్లిదండ్రులకు తెలపడంతో వారు వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఉపేంద్రను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఒకే రోజు ప్రమాదానికి గురైన నలుగురు చిన్నారులు

ఒకే మండలంలో ఒకేరోజు ఆరు మంది చిన్నారులు ప్రమాదానికి గురి కావడం అందులో నలుగురు మరణించడంతో మండలంలోని కె. నాగలాపురం, ఎస్.నాగలాపురం, పార్లపల్లి కడివెళ్ళ గ్రామాల్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల అర్ధనాదాలు గ్రామస్తులకు కంటనీరు తెప్పిస్తున్నాయి. మృతి చెందిన వారు, చికిత్స పొందుతున్న వారు అందరూ చిన్నారులు కావడంతో చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article