ఎమ్మెల్యేల ఫిరాయింపుపై చాలా సీరియస్గా ఉంది భారత రాష్ట్ర సమితి. ఎలాగైనా ఉప ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించాలని తపన పడుతుంది. పనిలో పనిగా పార్టీ నుంచి క్యాడర్ను ,లీడర్ షిప్ను కాపాడుకునేందుకు ఇదొక ఎత్తుగడగా వాడుకుంటుంది.
ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొంతమంది బహిరంగంగా పార్టీ మారినట్లు ప్రకటించారు, మరి కొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. ఈ పార్టీ ఫిరాయింపులపై ఏడాది క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది భారత రాష్ట్ర సమితి. హైకోర్టు ఎంతకీ తేల్చకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేసిన పిటీషన్లో సుప్రీంకోర్టు స్పీకర్ను త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ స్పీకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అదే పిటీషన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఇంప్లీడ్ అయ్యారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ 90 రోజుల్లోగా పార్టీ ఫిరాయింపులపై ఏదో ఒక చర్య తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఈ నెల 10న సుప్రీంకోర్టులో విచారణ ఉండబోతుంది. ఆలోపే స్పీకర్ కార్యాలయం నిన్న హడావుడిగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఇక పదవ తేదీన సుప్రీంకోర్టు టైం లైన్ కనుక విధిస్తే పార్టీ ఫిరాయింపులపై తొందర్లోనే చర్యలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు.
ఇందుకోసమే రేపు ఢిల్లీకి వెళ్తున్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపుల కేసును చాలా సీరియస్గా తీసుకున్న కేసిఆర్, కేటీఆర్తో పాటు మరికొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఢిల్లీకి పంపిస్తున్నారు. ఢిల్లీలో న్యాయవాదులతో చర్చించి.. అవసరమైతే రెండు మూడు రోజులు అక్కడే ఉండి కేసును ఫాలోఅప్ చేసుకొనున్నారు. కచ్చితంగా ఈ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బిఆర్ఎస్ పార్టీ పదే పదే చెబుతూ వస్తుంది. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో సమావేశాలు పట్టిమరి కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీరియస్ యాక్షన్ ఉండాలని పార్టీ గట్టిగా పోరాడుతుందో అప్పటినుంచి నిజానికి పార్టీ ఫిరాయింపులు కూడా తగ్గిపోయాయి. ఎమ్మెల్యేల స్థాయిలోనే కాదు కింది స్థాయిలలో కూడా పార్టీ క్యాడర్ పటిష్టంగానే ఉంది ఇప్పటికీ.. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇలాగే సీరియస్గా పోరాడాలని కేసీఆర్ నిర్ణయం. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వచ్చే జనరల్ ఎలక్షన్స్ కి ఇది ప్రీ ఫైనల్గా ఉంటుందని గులాబీ సైన్యం ఆలోచిస్తుంది. ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కచ్చితంగా సాధిస్తామని నమ్మకం పార్టీకి గట్టిగా ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి