గుప్తనిధులు అంటే చాలామందికి పిచ్చి ఉంది. దాని కోసం కోట్ల రూపాయలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దాని మీద ఆశ చావక ఇప్పటికీ గుప్తనిధుల కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది కేటుగాళ్లు గుప్త నిధులు ఉన్నాయి అని నమ్మించి లక్షలకు లక్షలకు కాజేసే పనిలో పడ్డారు. ఇవన్నీ అనేక చోట్ల జరుగుతున్నా.. ఇక్కడ జరిగిన ఈ టోకరా మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కొంతమంది గుప్త నిధులు తవ్వే కేటుగాళ్లను పట్టుకున్నారు. పోలీసులకు ముందస్తుగా వచ్చిన సమాచారం ప్రకారం ప్రొద్దుటూరు నుంచి ఆర్టిపికి వెళ్లే దారిలో ఉన్న స్మశానం దగ్గర కొంతమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి ఒక విగ్రహం కొన్ని జాతి రాళ్లు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వన్ టౌన్ పోలీసులు వారిని విచారించగా వారికి కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. వారి దగ్గర ఉన్నది గుప్తనిధులు కాదని గుప్త నిధులుపై కొంతమందికి ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని వారి వద్ద నుంచి లక్షలకు లక్షలు కాజేసి వారిని మోసం చేయాలనే ఆలోచనతో ముందుగానే ఒక విగ్రహాన్ని, కొన్ని జాతి రాళ్ళను కొని వాటిని పూడ్చిపెట్టి అవి గుప్తనిధులు అని నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసుల విచారణలో తేలింది. కడపకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి అలాగే కడప జిల్లాలోని వల్లూరు మండలానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని గుప్తనిధులు కనిపెట్టే గురువుగా అందరికీ పరిచయం చేస్తూ గుప్త నిధులపై ఆశ ఉన్న వారిని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని.. వీరిద్దరితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని వన్టౌన్ సిఐ వివరాలు వెల్లడించారు.
తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి కేటుగాళ్లు ఇక్కడే కాదు అన్ని చోట్ల ఉన్నారు.. గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి ముందుగానే అక్కడకు వెళ్ళి వాటిని పాతిపెట్టి అవే గుప్తనిధులుగా చూపిస్తూ తోకరా వేస్తున్నారు. వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని గుప్తనిధులు అనేవి లేవని వీటిపై చాలామంది ఆశపడి అపోహతో తమ ఆస్తులను పోగొట్టుకుంటున్నారని ఇలాంటి కేటుగాళ్ల వలలో చిక్కవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి