Silver Price: బంగారానికి బాబులా వెండి ధర.. కిలో రూ.1 లక్ష+.. కొంటే మంచిదేనా?

1 hour ago 1

మొన్న బంగారం పది గ్రాములు లక్ష రూపాయిలు అవుతుందా అన్న ప్రశ్న ఎదురైంది. మొత్తానికి 10 గ్రాముల పుత్తడి ధర 80 వేలు దాటి రికార్డ్ సృష్టించింది. అయితే లక్ష రేసులో గోల్డ్ కన్నా ముందు వెండి దూసుకొచ్చింది. ఇప్పుడు కేజీ వెండి ధర అక్షరాలా లక్షా 10 వేల రూపాయిలు. తొలిసారిగా ఇది లక్ష మార్క్ ను దాటింది. కేజీ వెండి లక్ష దాటిందా అంటూ చాలామంది నోరెళ్లబెట్టవచ్చు. కానీ ఇది నిజం. నిజానికి నిత్య వాడుకలో బంగారానికి ఉన్నంత డిమాండ్ వెండికి ఉండదు. పూజా సామగ్రి, భోజన సామగ్రి.. ఇంకా కొన్ని వస్తువుల కోసం ఎక్కువగా వెండిని ఉపయోగిస్తారు. ఈమధ్యకాలంలో సిల్వర్ జువెలరీ బాగా పాపులర్ అవుతోంది. కొన్నిచోట్ల వెండి ఆభరణాలకు గోల్డ్ కోటింగ్ కొట్టి విక్రయిస్తున్నారు. పైగా వీటి ధర కూడా తక్కువగా ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. మరి వీటన్నింటివల్లా వెండి ధర పెరుగుతోందా అంటే.. అవును అని చెప్పలేం. నిజానికి వెండి వాడకం పారిశ్రామికంగా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనికి ఇంత రేటు అంటున్నాయి వ్యాపార వర్గాలు.

ఈసారి బడ్జెట్ లో కేంద్రం కూడా వెండిపై ట్యాక్స్ ను తగ్గించింది. 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ఎక్కువమంది.. వెండిని ఇన్వెస్ట్ మెంట్ కోసం కొనడానికి ఆసక్తి చూపించారు. బంగారం కన్నా ఎక్కువ లాభాలు వస్తాయన్న అంచనాలు కూడా వారిలో ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం సిల్వర్ ఆర్నమెంట్స్ కు కూడా డిమాండ్ పెరిగింది. నిజానికి వెండిని ఆభరణాల కోసం వినియోగించేది.. 20 శాతం మాత్రమే.. మిగిలిన 80 శాతాన్ని పారిశ్రామిక అవసరాల కోసమే ఉపయోగిస్తారు. అంటే దీని వినియోగం ఎంత పెరిగితే.. వెండికి అంత డిమాండ్ తో పాటు ధర కూడా పెరుగుతుంది. ఈ ఒక్క లెక్కే చాలామంది వెండిపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడేలా చేసింది. నిజానికి ఈ ఏడాది మే నెలలో కిలో వెండి 96 వేల రూపాయిలపైనే పలికింది. ఇప్పుడు లక్షా పదివేలకు చేరింది. అంటే ఐదు నెలల వ్యవధిలోనే 14 వేల రూపాయిలు పెరిగింది. దీని ధర లక్ష రూపాయిలకు పెరుగుతుంది అని అప్పట్లోనే అంచనా వేశారు. కాకపోతే ఇంత త్వరగా పెరుగుతుందని ఊహించలేదు. అందుకే ఇప్పుడు అందరి దృష్టీ సిల్వర్ పై పడింది.

వెండి ధరను డిసైడ్ చేసేవి.. పారిశ్రామిక డిమాండ్ తో పాటు గనుల్లో ఉత్పత్తి. ప్రపంచంలో ఉత్పత్తయ్యే మొత్తం వెండిలో 50 శాతం వాటా ఐదు దేశాలదే. అవేంటంటే.. బొలీవియా, పెరూ, అర్జెంటీనా, చిలీ.. ఈ దక్షిణ అమెరికా దేశాలతో పాటు మెక్సికోలో కూడా వెండి గనులున్నాయి. కానీ ఆయా దేశాల్లో ఉన్న రాజకీయ అస్థిరతతోపాటు మరికొన్ని కారణాలతో.. వెండి ఉత్పత్తి ఆశించినంతగా లేదు. గద పదేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. అందుకే డిమాండ్ పెరిగినా సరఫరా మాత్రం అంతగా లేదు. ఇక మన దేశమైతే.. చైనా, బ్రిటన్, యూఏఈ నుంచి వెండిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. వెండితో పాటు అల్యూమినియం, రాగి, నికెల్ వంటి లోహాలను పారిశ్రామిక అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్తును స్టోర్ చేసేవాటిలో ఎక్కువగా వీటి వాడకం ఉంది. సో.. వెండితోపాటు మిగిలిన లోహాల డిమాండ్ కూడా తగ్గే అవకాశం లేదు. అందుకే ఎక్కువమంది తమ పెట్టుబడులను వీటివైపు మళ్లిస్తున్నారు.

అంతర్జాతీయంగా మన ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోంది. కాకపోతే విదేశీ పెట్టుబడిదారులు.. విక్రయాల బాట పట్టడంతో ఇన్వెస్ట్ మెంట్స్ వెనక్కు తీసుకుంటున్నారు. దీనివల్ల మన రూపాయి బక్కచిక్కుతోంది. ఇది డాలర్ కు బలాన్ని పెంచుతోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు.. తమ ఇన్వెస్ట్ మెంట్స్ ను బాండ్ల కన్నా.. లోహాలపై పెడుతున్నారు. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. వెండి ధర ఇప్పుడంటే.. లక్ష దాటింది కాని.. ఇదే అక్టోబర్ నెలలో రెండో వారంలో బంగారంతో పాటు దీని ధరా తగ్గింది. వెండి ధర అప్పట్లో 95 వేల నుంచి 90 వేల 500 రూపాయిలకు తగ్గింది. అంటే ఒకేసారి 4 వేల 500 రూపాయిలు తగ్గిందన్న మాట.

బంగారం వన్నె ఎప్పటికీ తగ్గదు. ఇది నిజమే. అలాగని వెండిని ఏమీ చిన్న చూపు చూడడం లేదు. ఈ సంగతి.. దాని దిగుమతులే చెబుతున్నాయి. పారిశ్రామిక వర్గాలు కూడా ఎక్కువగా వెండిని వినియోగిస్తుండడంతో సిల్వర్ కు డిమాండ్ కూడా పెరిగింది. అందుకే కిందటేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం డిమాండ్ ఎక్కువైంది. గత సంవత్సరం మన దేశం.. 3 వేల 625 టన్నుల వెండిని ఇంపోర్ట్ చేసుకుంది. ఈసారి దిగుమతులు దీనికి డబుల్ ఉండే ఛాన్సుంది. అంటే.. 6 వేల 500 నుంచి 7 వేల టన్నుల వరకు వెండిని దిగుమతి చేసుకునే అవకాశముంది. ఇక కేంద్రం లెక్కల ప్రకారం చూస్తే.. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే 4 వేల 554 టన్నుల సిల్వర్ దిగుమతి అయ్యింది. గత ఏడాది తొలి ఆరు నెలల్లో ఎంత వెండిని దిగుమతి చేసుకున్నామో తెలుసా.. కేవలం 560 టన్నులు మాత్రమే. అంటే ఈ రెండేళ్లలో తొలి ఆరు నెలల లెక్కను చూసినా.. ఈసారి 7 రెట్లకు పైగా అదనంగా వెండిని దిగుమతి చేసుకున్నట్టే. దీనిని బట్టి మన దేశంలో వెండికి డిమాండ్ ఏమేరకు పెరిగిందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

వెండి ధర పెరగడానికి దేశీయంగా కన్నా అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే ముఖ్యం. ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి పెట్టుబడులు తరలివచ్చాయి. అందుకే బంగారం, వెండి ధరలు పెరిగాయి. అమెరికా డాలర్ విలువ కూడా 84 రూపాయిలకు పైగా పలుకుతోంది. అందుకే ఇక్కడ వెండి, బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. నిజానికి వెండిధర ఇంతగా పెరగడానికి కారణం.. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణం. కొవిడ్ దెబ్బ కొట్టిన తరువాత.. యుద్ధాలు.. పరిస్థితిని మరింతగా దిగజార్చుతున్నాయి. తొలుత రష్యా, ఉక్రెయిన్ వార్ వచ్చింది. తరువాత ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇజ్రాయెల్ హెజ్ బొల్లా మధ్య జరుగుతున్న దాడులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాక్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం రావచ్చన్న వాతావరణం నెలకొంది. ప్రతాకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్.. నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ముందే దాడికి దిగవచ్చని తెలుస్తోంది. అటు అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు.. ఇరాన్ పై ఆంక్షలు విధించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇటు చైనా-తైవాన్ మధ్య కూడా ఉద్రిక్త వాతావరణమే ఉంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. అలాగే గెలిచినవారు అంతర్జాతీయంగా ఇప్పుడు నెలకొన్న పరిస్థితులపై ఎలాంటి విధానం అవలంబిస్తారు అన్న పాయింట్ కూడా ముఖ్యమే. అందుకే ఇప్పుడు.. ఇలాంటి అనిశ్చితి నెలకొనడంతో.. వెండితోపాటు మరికొన్ని లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article