జన్వాడ ఫామ్హౌస్ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఆయన స్వయంగా డీజీపీకి కాల్ చేసి మాట్లాడారు. రాజ్పాకాల, శైలేంద్ర ఇళ్లలో సోదాలపై డీజీపీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా.. వారి ఇళ్లలో ఎందుకు తనిఖీలు చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు కేసీఆర్.
శనివారం అర్థరాత్రి.. జన్వాడలోని ఓ ఇంట్లో డీజే సౌండ్స్తో గ్రాండ్గా పార్టీ సెటప్. భారీగా విదేశీ మద్యం, క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్.. ఇలాంటి ఎన్నో ఏర్పాట్లు సీన్ కట్ చేస్తే.. ఒక్కసారిగా పోలీసులు దాడులు చేశారు. మొత్తం 35మంది ఆ పార్టీలో ఉన్నారు. అందులో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఆ హౌస్ రాజ్ పాకాలకు చెందినది. ఆయన ఆధ్వర్యంలోనే ఈ పార్టీ జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పార్టీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిల్స్తో పాటు క్యాసినో పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్
పార్టీలో పాల్గొన్న వారికి అధికారులు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. అందులో విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ రావడంతో.. NDPS యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇక ఈ పార్టీ నిర్వహించిన రాజ్ పాకాలపై కేసు నమోదైంది. 34A, 34 (1), రెడ్విత్ 9 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇక అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ, విదేశీ మద్యం వినియోగంపైనా కేసులు నమోదయ్యాయి.
ఏ1గా రాజ్ పాకాల, ఏ2గా విజయ్ మద్దూరి
నార్కోటిక్ కేసులో రాజ్పాకాల, విజయ్ మద్దూరిపై FIR నమోదైంది. ఏ1గా రాజ్ పాకాల, ఏ2గా విజయ్ మద్దూరిని చేర్చారు అధికారులు. ఈ FIRలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్ పాకాలతో ఐదేళ్లుగా విజయ్ మద్దూరికి స్నేహం ఉన్నట్టు తేలింది. దివాలీ సందర్భంగా కొత్త ఇంట్లో పార్టీకి రాజ్ పాకాల ఆహ్వానించారు. పార్టీకి వచ్చేటప్పుడే విజయ్ తన వెంట కొకైన్ తెచ్చుకున్నారు. రాజ్ పాకాల కోరిక మేరకు ఇంట్లోనే విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్టు ఎఫ్ఐఆర్లో అధికారులు పేర్కొన్నారు.
విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా.. మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. రాజ్ పాకాలకు కొకైన్ ఎక్కడినుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా రాయదుర్గంలోని ఒరియన్ విల్లాస్లో ఉన్న రాజ్పాకాల సోదరుడు శైలేంద్ర ఇంట్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. న్యాయవాది సమక్షంలో ఈ సోదాలు జరిగాయి. ఇంట్లోని అణువణువునూ అధికారులు సోదా చేశారు.
అయితే అంతకుముందు శైలేంద్ర ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోదాలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు అడ్డుకున్నారు. దీంతో ఎక్సైజ్ అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో వివేకానంద, బాల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..