కాకతీయతీయుల కాలంలో విరాజిల్లిన బౌద్దం..! కొత్తగా బయటపడ్డ మరో శాసనం

2 hours ago 1

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో మరో చారిత్రాత్మక శాసనం బయటపడింది. త్రిపురాంతకం చుట్టుపక్కల ఇటీవల బయటపడ్డ కాకతీయుల అనేక శాసనాలతో పోలిస్తే, ఈ శాసనం భిన్నంగా ఉందని చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. శివారాధకులుగా ఉన్న కాకతీయులు సాధారణంగా శివాలయాలకు దానధర్మాలు, కైకంర్యాల కోసం దానాలు చేసినట్టు శాసనాలు ఉన్నాయి. అయితే తాజాగా లభించిన ఓ శాసనం అందుకు భిన్నంగా కాకతీయుల కాలంలోనే బౌద్దధర్మం కోసం భూములు దానమిచ్చినట్టు ఉండటం విశేషమంటున్నారు. ఈ శాసనం కాకతీయ రుద్రమదేవి కాలంనాటి 1285 సంవత్సరానిదని చెబుతున్నారు.

కాకతీయులు పదవ శతాబ్ధం నుండి పరిపాలించారు. వీరు ఎక్కువగా శైవారాధకులు. కాకతీయులు, వారి సామంతరాజులు, ప్రధానులు అనేక శైవాలయాలు నిర్మించారు. ఓరుగల్లు రాజధానిగా ఉన్నా వారికి ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంతో అవినాభావ సంబంధం ఉంది. రుద్రదేవుడు, గణపతిదేవుడు, మైలాంబ, రుద్రమదేవి, ప్రతాపరుద్రుని వరకు త్రిపురాంతకంతో సంబంధాలు కొనసాగించి ఇక్కడి శివాలయంలో పూజలు చేశారని అనవాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి వీరి శాసనాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. వీరి సామంతులు మాచయ నాయుడు, దేవరినాయనింగారు, కాయస్థ గంగయసాహిణి త్రిపురారిదేవుడు, జన్నిగదేవుడు, అంబదేవులు కూడా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరుని సేవించినవారే.

త్రిపురాంతకంలో బౌద్దం ఆనవాళ్ళు…

కాకతీయుల కాలం నాటి అనేక శాసనాలు ఇక్కడ లభ్యమవుతున్నా, దాదాపు అన్నీ శివాలయాలకు దానాలిచ్చినవే. బౌద్దం గురించి దాదాపుగా లభ్యం కాలేదు. ఈమధ్య కాలంలో శాసన పరిశోధకులు తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్ త్రిపురాంతకం చుట్టుపక్కల అనేక కాకతీయుల శాసనాలను కనుగొన్నాడు. కొత్తగా ఓ శాసనం లభించింది. ఈ శాసనం కాకతీయ రుద్రమదేవి కాలంనాటి 1285 నాటిది. ఇది ముచలింద నాగ శాసనం. శాసనంలో స్పష్టంగా పంచమహాశబ్ధ మహామండలేశ్వర మాండలిక రుద్రదేవ మహారాజులు సుఖభోగాలతో పృధ్వీ రాజ్యము చేయుచున్నదని వ్రాయబడింది.

రుద్రమదేవిని చిన్నప్పటి నుండి మగవారిగా పెంచడంవల్ల రుద్రదేవునిగా సంభోదిస్తారు. 1289 లో వృద్దాప్యంలో రుద్రమదేవి అంబదేవుని చేతిలో మరణించిందని చరిత్రకారులు చెబుతారు. 1285 వరకు చాలా ఉత్సాహవంతురాలిగా రుద్రమదేవి ఉందని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. బొల్నాయునిమల్లికార్జున నాయకులు మెట్టవాడలోని (వినుకొండ, త్రిపురాంతకం, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, కురిచేడులోని కొన్ని ప్రాంతాలు), దువ్వలి కంపణము (ప్రస్తుతం త్రిపురాంతకం మండలంలో ఉన్న దువ్వలి) లోని వెల్మపల్లి (ఇప్పుడున్న ఊరిపేరు వెల్లంపల్లి, త్రిపురాంతకం మండలం) గ్రామాన్ని.. ధాన్యకటకము (అమరావతి)లోని బౌద్దాలయానికి అంగరంగ భోగాలకు… అలాగే బౌద్దదర్మ పరిభోగాలకు కృష్ణవేణి నది తీరమందు. రుద్రదేవ మహారాజుకు పుణ్యము కొరకు ధార పోసినట్లుగా లిఖించబడింది. ఈ శాసనంపై శాసనపరిశోధకులు, రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్ మాట్లాడుతూ కాకతీయుల కాలంవరకు బౌద్దమతం ఆదరణ పొందుతూ ఉందని ఈ శాసనం తెలపుతుందని తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article