అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైనశైలిలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, గాజా యుద్ధం నేపథ్యంలో తాజా పరిస్థితిపై నెతన్యాహూతో ట్రంప్ తో చర్చించారు. ‘గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది.
అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే.. అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు కల్పించవచ్చు, ఇళ్లు నిర్మించవచ్చు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన చరిత్రను మారుస్తుందని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్లు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈ క్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకొని, అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం.