తీన్మార్ మల్లన్నకు వారం రోజుల డెడ్ లైన్ విధించింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. కులగణనపై ఇష్టారీతిన మాట్లాడటం, నివేదికను తగలబెట్టడాన్ని సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. పార్టీ లైన్ దాటి మాట్లాడటం, కులగణనపై తీవ్ర విమర్శలు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఈ నెల 12లోగా రిప్లై ఇవ్వాలని ఆదేశించింది.
దేశంలోనే మొదటిసారి కులగణన చేసిన పార్టీగా రికార్డ్ సృష్టించామని, ముఖ్యమంత్రి రేవంత్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారని కాంగ్రెస్ చెప్తుంది. పార్టీ ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్సీ హోదాలో ఉండి పార్టీ నాయకత్వం, ప్రభుత్వం నిర్వహించిన సర్వేపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నది. పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ బీఫామ్ ఇచ్చి గెలిపిస్తే.. ఈ విధంగా ప్రవర్తించడం బాగోలేదని.. పార్టీ నామ్స్ అండ్ గైడ్లైన్స్ పాటించనందుకు వారంలో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.
వరంగల్ సభలో ఒక కులాన్ని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. వివరణ ఇచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీ కులగణన సర్వేతో పాటు.. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్న.. కాంగ్రెస్ షోకాజ్ నోటీసులకు ఏ విధంగా బదులిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి