తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు తారక్. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ,
పోలీస్ డిపార్ట్మెంట్, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.