చిత్తూరుకు చెందిన నిండు గర్భిణీపై ట్రైన్లో అఘాయిత్యం జరిగింది. ప్రతిఘటించిన మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైంది. ఇది తమిళనాడులోని గుడియాత్తం వద్ద ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్న గర్భిణీపై జరిగిన లైంగిక దాడిపై కేసు నమోదు అయ్యింది. కోరిక తీర్చలేదని కాళ్లు చేతులు విరిచి ట్రైన్ నుంచి తోసేసిన మానవ మృగాన్ని అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. చిత్తూరుకు చెందిన బాధిత కుటుంబం కూలీ పనుల కోసం తమిళనాడులోని తిరుప్పూర్కి వెళ్ళి అక్కడే ఉంది. ప్రతి నెల డ్వాక్రా డబ్బు చెల్లించేందుకు తిరుప్పూర్ నుంచి చిత్తూరు వస్తున్న బాధిత మహిళ.. ఇందులో భాగంగానే నిన్న కూడా చిత్తూరుకు ట్రైన్లో బయలుదేరింది. లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసింది.
ట్రైన్ జోలార్పేట జంక్షన్కు వచ్చాక లేడీస్ కంపార్ట్మెంట్లోని మహిళా ప్రయాణికులందరూ దిగిపోవడంతో ఒంటరిగా ఉండిపోయింది సదరు మహిళ. అదే లేడీస్ కంపార్ట్మెంట్లోకి చొరబడ్డ హేమరాజ్ అనే యువకుడు ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారయత్నం చేయబోయాడు. సైకోలా వ్యవహరించాడు. ప్రతిఘటించిన మహిళ కాళ్లు, చేతులు విరిచి రన్నింగ్ ట్రైన్ నుంచి తోసేసాడు. కాట్పాడికి సమీపంలో ఈ ఘటన జరగ్గా.. బాధిత మహిళ కేకలు వేయడంతో పక్క భోగిలోని ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తీవ్రంగా గాయపడ్డ మహిళను రైల్వే పోలీసులు వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడు హేమరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. హేమరాజ్కు నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న హేమరాజ్ బెయిల్పై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ట్రైన్లో ప్రయాణిస్తున్న గర్భిణీపై జరిగిన లైంగిక దాడికి నిరసనగా తమిళనాడులో ప్రజా సంఘాలు నిరసనలు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి