Hyderabad: “మరో 48 గంటల్లో మీ ముగ్గురు అతి భయంకరంగా చావబోతున్నారు”.. వాట్సాప్‌లో మెసేజ్.. చివరికి..!

2 hours ago 1

“మీ కుటుంబంపై చేతబడి చేశా.. ఈ రోజు అమావాస్య.. మరో 48 గంటల్లో మీ ముగ్గురు అతి భయంకరంగా చావబోతున్నారు” అని వాట్సాప్​లో వీడియోలు పంపి బెదిరించిన ఓ వ్యక్తిని సౌత్​ఈస్ట్​ టాస్క్‌ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు మీద ఆశతో చేసిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. కాగా, దీనికి సంబంధించి టాస్క్‌ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్​ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ మహానగరం ఫలక్‌​నుమా అల​జుబేల్​ కాలనీకి చెందిన మొహమ్మద్​ ఇర్ఫాన్​ ఆలీఖాన్​, తన సోదరి, తల్లితో కలిసి నివసిస్తున్నారు. అయితే.. అక్టోబర్ 2వ తేదీన అర్ధరాత్రి 10 గంటలకు మొహమ్మద్​ ఇర్ఫాన్​ ఖాన్‌​కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. ‘ఈ రోజు అమావాస్య.. మరో 48 గంటల్లో మీరు చనిపోతున్నారు’ అని ఆ వ్యక్తి బెదిరించి కాల్‌​ను డిస్‌కనెక్ట్​ చేశాడు. ఇది జరిగిన కాసేపటికే ఇర్ఫాన్​ ఆలీఖాన్, అతని సోదరితో పాటు తల్లికి సంబంధించిన ఫొటోలకు చేతబడి చేస్తున్న ఒక భయంకరమైన వీడియోను సదరు వ్యక్తి వాట్సాప్​ ద్వారా పంపించాడు. దీంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తమ ఆస్తిని కాజేయడానికి తమను శారీరకంగా, మానసికంగా దెబ్బతీయడానికి తమ వదిన నాజియానే ఇలా కుట్ర పన్నిందని ఇర్ఫాన్​ ఆలీఖాన్ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే ఈ విషయమై బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి చేతబడికి పాల్పడిన సదరు గుర్తు తెలియని వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ఇర్ఫాన్​ ఆలీఖాన్ ఫిర్యాదు మేరకు టాస్క్‌ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్​ పర్యవేక్షణలో సౌత్‌ఈస్ట్​ టాస్క్‌ఫోర్స్​ ఇన్స్‌పెక్టర్​ ప్రసాద్​ వర్మ బృందం, బండ్లగూడ ఇన్స్‌పెక్టర్​ సత్యనాయణ టీమ్‌తో కలిసి పరారీలో ఉన్న బహదూర్‌పు​రా, హసన్‌​నగర్‌​కు చెందిన మొహమ్మద్​ ఖలీం అలియాస్​ ఖాలీ (48) అనే రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఆపై పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. తన అత్త, ఆడపడుచు, మరిదిలు తనను వేధిస్తున్నారంటూ నాజియా అనే మహిళ మొహమ్మద్​ ఖలీంను ఆశ్రయించింది. దీంతో అవసరం కోసం వచ్చిన ఆ మహిళను అవకాశంగా వినియోగించుకోవాలని కుట్ర పన్నాడు ఆ రౌడీ షీటర్. తనకు అవసరమైనన్ని డబ్బులు ఇస్తే ఈ అమావాస్య తరువాత 48 గంటల్లో మీ అత్త, ఆడపడుచు, మరిదిలు భయంకరంగా చచ్చేటట్లు చేస్తానని నాజియాకు చెప్పాడు.

ఈ దెబ్బతో తాను కక్ష పెంచుకున్న ఆ ముగ్గురి పీడ విరగడ అవుతుందని, తనకు ఎలాంటి అడ్డు ఉండదని ఆ మహిళ నమ్మింది. ఆ ముగ్గురి ఫొటోలు సేకరించి, వారిపై చేతబడికి పాల్పడుతున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి తిరిగి వారికే వాట్సాప్‌లో పంపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చేతబడికి పాల్పడిన మొహమ్మద్​ ఖలీంను సౌత్​‌ఈస్ట్​ టాస్క్‌ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి క్షుద్ర పూజల సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని బండ్లగూడ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా చేతబడులు అంటూ నమ్మే జనాలు ఉన్నారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article