యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం హెడ్లైన్స్లో నిలుస్తోంది. ఇందుకు కారణం పవార్ కుటుంబమే. దేశంలోనే సుదీర్ఘ రాజకీయానభవం కలిగిన నేతల్లో ఒకరైన శరద్ పవార్ బారామతిపై కొన్ని దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతూ జాతీయస్థాయి నేతగా ఎదిగారు. రాజకీయ భీష్ముడు శరద్ పవార్కు ఈ స్థాయి కల్పించిన బారామతి ఇప్పుడు పవార్ కుటుంబంలోనే ఆధిపత్య పోరుకు తెరతీసింది. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లోనే ఈ కుటుంబం నుంచి ఇద్దరు మహిళలు తలపడ్డారు. గత ఐదేళ్లలో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఈ కుటుంబంలోనూ చీలిక తీసుకొచ్చాయి.
బారామతి శరద్ పవార్కు వరుస విజయాలు అందించి కంచుకోటగా పేరొందింది. శరద్ పవార్ 1967లో తొలిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1990 వరకు వరుసగా 6 పర్యాయాలు శరద్ పవార్ బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్కు శక్తివంతమైన నేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ‘సహకార ఉద్యమం’ ద్వారా మరఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్రలో బలమైన నేతగా ఎదిగారు. 1991లో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది. అప్పుడు తన ఎమ్మెల్యే పదవిని వదులుకుని ఎంపీగా జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన శరద్ పవార్, తన కుటుంబానికే చెందిన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ను బారామతి నుంచి ఎమ్మెల్యేను చేశారు. దేశ రాజకీయాల్లో శరద్ పవార్ చక్రం తిప్పుతున్న సమయంలో అజిత్ పవార్ రాష్ట్రంలో బలమైన నేతగా ఎదిగారు. శరద్ పవార్ రికార్డును అధిగమిస్తూ ఆయన 7 పర్యాయాలు (1991 నుంచి 2019) ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంటే మొత్తంగా 1962 నుంచి ఇప్పటి వరకు పవార్ కుటుంబం ఈ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కంచుకోటలోనే అంతర్యుద్ధం మొదలైంది.
2024 లోక్సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్ స్థానంలో అజిత్ పవార్ తన భార్య సునేత్ర పవార్ను బరిలోకి దించారు. ప్రత్యర్థిగా శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నుంచి ఆయన కుమార్తె సుప్రియా సూలే పోటీ చేశారు. వరుసకు సోదరైన సుప్రియాపై తన సతీమణిని బరిలోకి దింపడం రాజకీయంగా అజిత్ పవార్కు శరాఘాతంగా మారింది. ఈ ఎన్నికల్లో సునేత్ర ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో అజిత్ పవార్ చీలిక వర్గం బలం ఎంత అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎన్సీపీ ఓటుబ్యాంకులో ఎక్కువ శాతం శరద్ పవార్తోనే ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. దీంతో తన తప్పును గ్రహించిన అజిత్ పవార్.. తమ కుటుంబంలో విభజన ప్రజలకు నచ్చలేదని వ్యాఖ్యానించారు. తన పొరపాటును బహిరంగంగానే అంగీకరించి జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేశారు.
తాజాగా అజిత్ ఓ ప్రొఫెషనల్ ఏజెన్సీని రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నట్టు తెలిసింది. ఈ ఏజెన్సీ సలహా మేరకు అజిత్ మరాఠ్వాడీ, పశ్చిమ మహారాష్ట్రలో గెలుపు వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ ఈసారి పోటీ చేయకపోవచ్చని చర్చ జరుగుతోంది. తన కుమారుడిని బారామతి నుంచి ఎన్నికల్లో పోటీ చేయించవచ్చు అని ఊహాగానాలు నెలకొన్నాయి. మరోవైపు శరద్ పవార్ తన మనవడు యుగేంద్రను ఇక్కడి నుంచి పోటీకి దింపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. యుగేంద్ర ఇక్కడి నుంచి రంగంలోకి దిగితే మళ్లీ ఒకే కుటుంబం తలపడాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అజిత్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది.