దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా (SCI).. ఖాళీగా ఉన్న జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో తుది గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సుప్రీంకోర్టు జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్ కూడా ఉండాలి. నోటిఫికేషన్లో సూచించిన విధంగా 35 పదాలు నిమిషానికి టైప్ చేసే స్కిల్ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మార్చి 8, 2025వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్ ద్వారా మార్చి 8, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్ సర్వీస్మెన్ / మహిళా/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో 128 వరకు పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. ఎంపికైన వారికి నెలకు జీతంగా రూ.35,400 వరకు చెల్లిస్తారు.
రాత పరీక్ష విధానం..
రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూట్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఇక టైపింగ్ స్కిల్ 10 నిమిషాలు ఉంటుంది. 3 శాతం తప్పులకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఇంగ్లిష్ భాషలో 2 గంటలపాటు డిస్క్రిప్టివ్ టైప్లో ఎస్సై రాత పరీక్ష ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.