మత్తుకు బానిసైన ఓ యువకుడు కన్నతల్లిని కడతేర్చాడు. అడిగితే డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ముళ్లపొదలోకి శవాన్ని ఈడ్చుకెళ్లి పడేసి, పరారయ్యాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో చోటు చేసుకుంది. మహాదేవునిపేట గ్రామానికి చెందిన లేట్ల ఉత్తయ్య కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉత్తయ్యకు నాగమ్మ, యాదమ్మ ఇరువురు భార్యలు ఉన్నారు. అదే గ్రామంలో ఇద్దరు భార్యలు వేర్వేరు గుడిసెల్లో నివాసముంటున్నారు. ఇరువురు కూడా కూలీపని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇద్దరు భార్యల్లో ఒకరైన యాదమ్మకు కరుణాకర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే కరుణాకర్ మద్యం, గంజాయి కి బానిసగా మారి ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో మూడు రోజుల క్రితం తల్లి యాదమ్మతో గొడవ పెట్టుకున్నాడు. అయితే అప్పటికే గంజాయి మత్తులో ఉన్న కరుణాకర్… ఆవేశంతో తల్లిని గోడకేసి బలంగా కొట్టాడు.. దీంతో తల్లి యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం బయటకు పొక్కకుండా తల్లి మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న ముళ్లపొదలోకి ఈడ్చుకెళ్లి అక్కడ పడేసాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
తల్లిని చంపి మూడు రోజులు గడిచింది. గత రాత్రి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కుక్కలు, పందులు కొంతభాగం పీక్కుతిన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
విషయం భర్త ఉత్తయ్యకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మత్తు దిగిన అనంతరం ఎప్పటిలాగే కుమారుడు కరుణాకర్ ఇంటికి చేరుకున్నాడు. అనుమానంతో కుమారుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. కన్నతల్లిని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడు కరుణాకర్ ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి