TG DSC 2024 Result: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు మరింత ఆలస్యం.. కారణం ఇదే!

2 hours ago 2

హైదరాబాద్‌, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. సెప్టెంబరు 6వ తేదీన డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షల తుది ఆన్సర్‌ ‘కీ’ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీ ఆన్సర్‌ కీలో వచ్చిన తప్పులు అన్నీ ఇన్నీ కావు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభ్యర్ధులు ఆందోళన చేపట్టారు. అయితే దీనిపై ఇప్పటి వరకూ విద్యాశాఖ అధికారులు పెదవి విప్పలేదు.

గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం.. ఇప్పటికే డీఎస్సీ ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. అందులో వచ్చిన మార్కులకు టెట్‌ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌)ను కూడా ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుది కీ విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా.. ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం. ఇక డీఎస్సీ జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌) విడుదల ఇప్పట్లో వచ్చేలా లేదని, అది మరింత ఆలస్యం కానుందని చెప్పకనే చెబుతున్నారు. తుది ‘కీ’పై వచ్చిన డీఎస్సీ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించామని, కానీ వాటికి మార్కులు ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయానికి వచ్చి వాపోయారు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.

మరోవైపు డీఎస్సీ తుది కీ విడుదల చేసిన తర్వాత గతంలో కొంత మంది అభ్యర్ధులు తప్పులతడకగా టెట్‌ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారని అధికారులు గుర్తించారు. దాంతో ఆ వివరాల సవరణకు సెప్టెంబర్‌13వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. జీఆర్‌ఎల్‌ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్‌ జాబితాను డీఈవోలకు పంపించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు జీఆర్‌ఎల్‌ను విడుదల చేయలేదు. సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం రోజు డీఎస్సీ అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేస్తామని చెప్పిన రేవంత్‌ సర్కార్.. సెప్టెంబర్ నెల ముగుస్తున్నా డీఎస్సీ ఫలితాలు వెల్లడించకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

RBI ఆఫీసర్ గ్రేడ్-బి ప్రిలిమ్స్‌ ఫలితాలు.. అక్టోబర్‌ 19న ఫేజ్‌-2 పరీక్ష

దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక పరీక్ష (ఫేజ్‌-1) ఫలితాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలను విడుదల చేసింది. ఫేజ్‌-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్‌ 19వ తేదీన ఫేజ్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 94 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article