పశ్చిమగోదావరి జిల్లా పేరు చెబితే పందెం కోళ్లు గుర్తుకు వస్తాయి. కానీ, ఇప్పుడు ఓ యువకుడు న్యూ ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. పల్లెల్లో సైతం కనుమరుగవుతున్న ఎద్దులకు జీవం పోస్తున్నాడు. అద్భుతమైన ఎద్దుల బొమ్మలను తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలూరుకు చెందిన శంకర్ కు చిన్నతనం నుంచి బొమ్మలు గీయటమంటే ఇష్టం.. బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు సైతం వెళ్లాడు.
కానీ అక్కడ చేసే పని కంటే తనకు వచ్చిన కళనే నమ్ముకోవాలని బొమ్మల తయారీ ప్రారంభించాడు. మనుషుల విగ్రహాలతో పాటు ఎద్దుల బొమ్మలను తయారు చేస్తున్నాడు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి వేడుకలను ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో సహా తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సైతం హాజరయ్యారు.. ఈ వేడుకల్లో పాలూరులో శంకర్ తయారు చేసిన ఎద్దుల బొమ్మలను ప్రదర్శనలో ఉంచారు. ఇవే అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ నేతలు, అధికారులు ఎవరు వచ్చినా ఎద్దుల బండ్లు బహుమతిగా ఇస్తున్నారు. పెద్ద సైజులో ఉండే వాటిని టీ పాయ్ లు గా ఉపయోగిస్తున్నారు. బాగా చిన్న వాటిని షోకేస్ లో ఉంచుతున్నారు.