ఒకసారి జరిగితే అది పొరపాటు. మరోసారి జరిగితే కచ్చితంగా అది తప్పే. ఈ పొరపాటు..తప్పుగా మారకముందే యోగి సర్కార్ అప్రమత్తమైంది. మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజున తొక్కిసలాట జరిగింది. ఊహించిన దాని కన్నా ఎక్కువ మంది భక్తులు పోటెత్తడం వల్ల ఈ పొరపాటు తలెత్తింది. బారికేడ్లపైకి ఎక్కి మరీ దూసుకెళ్లారు భక్తులు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే..ఈ ప్రమాదంపై ఎన్ని విమర్శలు వస్తున్నా..వాటికి సమాధానం ఇస్తూ కూర్చోకుండా..యోగి సర్కార్ యాక్షన్లోకి దిగిపోయింది. అప్పుడు ఏం జరిగింది..? ప్రమాదం జరగడానికి కారణాలేంటి..? మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..? అనే అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అప్పుడంటే పొరపాటున జరిగిపోయింది. ఇది రిపీట్ కావద్దు అంటే..ఓ పక్కా ప్లాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలి. ప్రస్తుతం మహా కుంభమేళా ఏర్పాట్లలో ఇదే జరుగుతోంది. వసంత పంచమి సందర్భంగా..ఈ ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా చేసింది యోగి ప్రభుత్వం.