హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తుంది. అక్కడి సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఈ కమిటీ బయటబయటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు సిద్ధిక్పై కేరళ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు సోదాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే సిద్ధిఖీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ‘మీటూ’ ఉద్యమంలో పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులు, హీరోలు పీకల్లోతు వివాదంలో ఇరుక్కుపోయారు. దీనిలో భాగంగా ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన ఓ నటి అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఓ తమిళ సినిమాలో అవకాశం రావాలంటే తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే సిద్ధిఖీ డిమాండ్లను నటి తిరస్కరించడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. 2016లో తిరువనంతపురంలోని ఓ హోటల్లో సిద్ధిఖీ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను నటుడు సిద్ధిఖీ ఖండించాడు. బాధితురాలు 2019 నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు. మరోవైపు సిద్ధిఖీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కేరళ హైకోర్టు దానిని కొట్టివేసింది. సిద్ధిఖీ ముందస్తు బెయిల్ కోర్టు తిరస్కరించిన తర్వాత ఆత్యాచార ఆరోపణలు చేసిన నటి మీడియాతో మాట్లాడుతూ..
‘నేటి కోర్టు తీర్పు పట్ల నేను సంతోషిస్తున్నాను. రాబోయే విచారణ గురించి ఎదురు చూస్తున్నాను. అయితే సిట్ విచారణపై కొంత అసంతృప్తిగా ఉంది. దర్యాప్తులో గోప్యత పాటిస్తే బాగుంటుంది. రెండు రోజుల క్రితం కొన్ని విషయాలు మీడియాకు లీక్ అయ్యాయి. ఇది నిందితులకు సహాయపడగలదు. పలు విషయాలను ఎత్తిచూపుతూ డీజీపీకి ఫిర్యాదు చేసిన అంశాలు బయటకు వచ్చాయి. ఇది ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి, సాక్షులను ప్రభావితం చేయడానికి పురిగొల్పుతుందని’ నటి ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి