రాష్ట్రాల్లో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి నీతి అయోగ్ సహకారం చాలా అవసరం.. ఏపీ అభివృద్ధి సహకారం అందించాలంటూ.. సీఎం చంద్రబాబు కోరారు.. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ శుక్రవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధితోపాటు పలు విషయాలను సీఎం చంద్రబాబు.. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు వివరించారు. ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధించి 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను నెలకొల్పి.. తద్వారా 42 వేల డాలర్ల తలసరి ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వివరించారు. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని.. వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్గా ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్లు, స్కిల్లింగ్ హబ్స్, స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం – నీతి ఆయోగ్ కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు.
ఏపీ తీసుకున్న కీలక కార్యక్రమాలైన నదుల అనుసంధానం, పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మాలన, 2047 విజన్లోని పది ప్రధాన సూత్రాల అమలుకు నీతి ఆయోగ్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్ధిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, సుస్థిరత.. ప్రధానాంశాలుగా స్వర్ణాంధ్ర-2047పై ప్రధానంగా దృష్టిపెట్టామన్నారు సీఎం చంద్రబాబు. 3 సీ పోర్టులు, 3 ఎయిర్ పోర్టులు ఉన్న తిరుపతి-చెన్నై-నెల్లూరును ట్రై సిటీగా తీర్చిదిద్దితే ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకువెళ్తుందన్నారు.
తిరుపతి – అమరావతిని రీజినల్ గ్రోత్ హబ్లుగా మలచాలి
దేశంలోని 4 గ్రోత్ హబ్లో ఒకటిగా ఉన్న విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్తో పాటు తిరుపతి – అమరావతిని రీజినల్ గ్రోత్ హబ్లుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలన్నారు. బ్లూ ఎకానమీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ డెవలప్మెంట్ను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామన్నారు. డేటా సేకరణ, బెస్ట్ ప్రాక్టీసెస్, స్ట్రాటజిక్ పార్టనర్షిప్స్, ప్రైవేట్ పెట్టుబడులను ఆకట్టుకోవడం, ఎఫ్డీఐ, రిసోర్స్ మొబిలైజేషన్ తదితర విషయాల్లోనూ నీతి ఆయోగ్ కీలకపాత్ర పోషించాలనేదే తమ ఆకాంక్షగా నీతి ఆయోగ్కి తెలిపారు సీఎం చంద్రబాబు.
గ్లోబల్ లీడర్గా ఏపీని తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. అయితే రాష్ట్రం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విభజన వల్ల రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఆర్ధిక వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం, ఆదాయానికి గ్రోత్ ఇంజిన్ వంటి హైదరాబాద్ను కోల్పోవడం, ఏపీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం, గత ప్రభుత్వం మూలధన వ్యయంపై నిర్లక్ష్యం చూపడం, మౌలికవసతులను కల్పించకపోవడం సమస్యగా మారాయన్నారు.
జినోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు
హైదరాబాద్లో తాను అభివృద్ధి చేసిన జినోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో అత్యుత్తమ పాలసీలను ఏపీలో అమలు చేయాలనేదే తమ విధానమన్నారు సీఎం చంద్రబాబు. 2029 కల్లా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో 11 వేలకు పైగా ఈవీ బస్సులను ప్రవేశ పెట్టాలి. అలాగే రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లపైనా రూఫ్ టాప్ సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు.
కేంద్రానికి – రాష్ట్రానికి ఇది అనుకూల సమయమని, అభివృద్ధికి ఎంతో ఆస్కారముందని. ఇందులో తమ భాగస్వామ్యం కూడా కచ్చితంగా ఉంటుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ స్పష్టం చేశారు.
ఇక సీఎంతో భేటీ సందర్భంగా సచివాలయానికి తొలిసారి వచ్చిన సుమన్ బేరీకి కారు దగ్గరే రిసీవ్ చేసుకుని ఘన స్వాగతం పలికారు మంత్రి పయ్యావుల కేశవ్. సమావేశం అనంతరం సుమన్ బేరీ కారు దగ్గరకు వచ్చి స్వయంగా వీడ్కోలు పలికారు సీఎం చంద్రబాబు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..