Diwali 2024: దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి? ఎక్కడ వెలిగించాలి? నియమాలు తెలుసుకోండి

1 hour ago 1

దీపావళి హిందువులు జరుపుకునే ప్రధానమైన, ముఖ్యమైన పండుగ. దీనిని “ఫెస్టివల్ ఆఫ్ లైట్” అని కూడా అంటారు. ఈ పండుగ చెడుపై మంచికి గుర్తు.. చీకటి నుంచి కాంతిలోకి పయనం.. విజయాన్ని సూచిస్తుంది. అందుకే ఆశ్వయుజ మాసం అమావాస్య తిధి రోజున చీకటి రాత్రిలో వెలుగులు నింపుతూ దీపాల ను వెలిగించి చీకటిని తొలగించి కాంతులు నింపే పండగ. దీపావళి రోజున శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడనే నమ్మకం. రాముడు తిరిగి వచ్చిన సందర్భంగా అయోధ్య వాసులు ఈ పండుగను జరుపుకున్నారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను పువ్వులు, రంగోలి, రంగురంగుల దీపాలతో అలంకరించారు.

దీపావళి రోజున దీపాలు వెలిగించే సంప్రదాయం

శ్రీ రాముడు వనవాసం ముగించుకుని తన రాజ్యమైన అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్యలోని ప్రజలు రామయ్యకు స్వాగతించడానికి.. తమ ఆనందం తెలియజేయడానికి దీపాలను వెలిగించి తమ ఇళ్లను, మొత్తం అయోధ్య నగరాన్ని అలంకరించారని నమ్ముతారు. అందుకే దీపావళి రోజున ఇంటిని దీపాలతో అలంకరించుకునే సంప్రదాయం ఉంది. దీపావళి పండుగ 5 రోజుల పండుగ. ఈ ఐదు రోజులూ దీపాలు వెలిగిస్తారు. దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగిస్తే శుభప్రదం? ఏయే ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి? ఏ రోజు ఎన్ని దీపాలు వెలిగించే సంప్రదాయం ఉందో ఈ రోజు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ధనత్రయోదశి రోజున మొదటి దీపం వెలిగిస్తారు

దీపావళి పండుగ ధన త్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజున దీపావళి పండుగ మొదటి దీపం వెలిగిస్తారు. ధన త్రయోదశి రోజున వెలిగించే ఈ దీపం మృత్యుదేవతగా భావించే యమదేవునికి అంకితం చేయబడింది. ఈ రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వెలుపల దక్షిణం వైపు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యమ ధర్మ రాజు అనుగ్రహం ఉంటుందని.. ఆ కుటుంబంలో ఎవరూ అకాల మరణం చెందరని ఈ దీపం వెలిగించడం వెనుక విశ్వాసం. ఈ దీపాన్ని ఆవనూనెతో వెలిగిస్తారు. దీపం వెలిగించిన తరువాత.. ఇంటిలోని సభ్యులెవరూ ఇంటి నుండి బయటకు వెళ్లకూడదనేది ఒక నియమం.

దీపావళికి ఎన్ని దీపాలు వెలిగించాలంటే

శుభ కార్యాలలో ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో అంటే 5, 7, 9, 11, 51 , 101 ఇలా దీపాలను వెలిగించాలని హిందూ మతంలో ఒక నమ్మకం. దీపావళి రోజున నువ్వుల నూనెతో దీపాలను వెలిగించే సంప్రదాయం ఉంది. విశ్వాసాల ప్రకారం దీపావళి రోజున కనీసం 5 దీపాలను వెలిగించాలి

దీపావళి రోజున ఏ ప్రదేశాలలో దీపాలు వెలిగించాలంటే

దీపావళి రోజున సుఖ సంతోషాలు, సిరి సంపదల కోసం వివిధ ప్రదేశాలలో దీపాలను వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

పూజా గది దీపావళి రోజున ఇంటి పూజా గదిలో లేదా పూజా మందిరంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి, గణేశుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

తులసి మొక్క దగ్గర దీపావళి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

డబ్బు ఉంచే ప్రదేశంలో డబ్బు లేదా ఆభరణాలు ఉంచే ప్రదేశంలో దీపం వెలిగించడం సంపదను శాశ్వతంగా పెంచుకోవడానికి సహాయపడుతుందని భావిస్తారు.

ప్రధాన ద్వారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి, శ్రేయస్సు ప్రవేశిస్తుంది. ఇలా చేయడం లక్ష్మీ దేవి స్వాగతానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

తాగునీరు దీపావళి రోజున కుటుంబం మొత్తానికి తాగునీరు వచ్చే ప్రదేశంలో దీపం ఉంచండి.

వంటగది వంటగదిలో దీపం వెలిగించడం అన్నపూర్ణ దేవి అనుగ్రహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంటికి ఆహారం, శ్రేయస్సును అందిస్తుంది.

కిటికీలు, బాల్కనీలు ఇంటి కిటికీలు, బాల్కనీలు, తలుపులు అన్నింటిలో దీపాలను వెలిగించడం వల్ల ఇల్లు అంతటా కాంతి ప్రసరిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

ప్రాంగణం ఇంటి ప్రాంగణంలో లేదా టెర్రస్‌ పై దీపం వెలిగించడం వల్ల ఇంటి మొత్తానికి కాంతి వస్తుంది. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article