JEE Main 2025 Toppers List: జేఈఈ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. కోచింగ్‌ లేకుండానే ఫస్ట్‌ ర్యాంక్

2 hours ago 2

అమరావతి, ఫిబ్రవరి 12: జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌ 1 ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్‌) ఫలితాలను ఎన్టీయే విడుదల చేయగా అందులో.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్‌ సాధించిన 14 మందిలో ఏపీ, తెలంగాణల నుంచి ఇద్దరు ఉండటం విశేషం. హైదరాబాద్‌కు చెందిన బణిబ్రత మాజీ, గుంటూరుకు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ ఆల్ ఇండియా లెవల్ ఫస్ట్ ర్యాంక్‌ సాధించారు. అయితే అమ్మాయిల్లో సాయి మనోజ్ఞ టాపర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి వంద పర్సంటైల్‌ సాధించిన వారిలో అత్యధిక మంది రాజస్థాన్‌ నుంచి ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి ఏకంగా ఐదుగురు ఉన్నారు.

ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన టాపర్ సాయి మనోజ్ఞ మీడియాతో పలు విషయాలు పంచుకుంది. సాయిమనోజ్ఞ.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని గుత్తికొండలో నివాసం ఉంటున్న కిషోర్‌ చౌదరి, పద్మజ దంపతుల కుమార్తె అయిన సాయిమనోజ్ఞ.. స్థానికంగా ఉన్న భాష్యం కాలేజీలో ఇంటర్ సెకండియర్‌ చదువుతుంది. తల్లి పద్మజ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పరిపాలన విభాగం ఉద్యోగిని. తండ్రి కిషోర్‌చౌదరి ఇంజినీరింగ్‌ కాలేజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. జేఈఈకి ప్రిపరేషన్‌ కోసం తాను నిత్యం 13 గంటల పాటు చదవడంతో పాటు ఇంటి వద్ద మరో గంట పాటు సాధన చేశానని సాయి మనోజ్ఞ తెలిపింది. కెమిస్ట్రీ కొంత కష్టంగా అనిపించినా రోజుకు కొన్ని అంశాల చొప్పున చదివానని తెల్పింది. ఒత్తిడి అనిపించినప్పుడు ధ్యానం చేశానని, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను పూర్తిగా డీయాక్టివేట్ చేసినట్లు తెలిపింది. చదువుపై దృష్టి పెట్టాలని అనుకున్నానని, కానీ సోషల్ మీడియా నన్ను కలవరపెట్టేది. మొదట్లో ఇది కష్టమే.. కానీ మంచి కళాశాలలో చేరాలంటే, ఈ తాత్కాలిక త్యాగం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. పైగా తాను ఏ కోచింగ్ సెంటర్‌లోనూ శిక్షణ తీసుకోలేదని తెల్పింది. కాగా మనోజ్ఞ ICSE పదో తరగతిలో కూడా అగ్రస్థానంలో నిలిచింది.

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరంలో బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో ఐదు రోజులపాటు జేఈఈ మెయిన్‌-2025 తొలి విడత పేపర్‌ 1 పరీక్షలు జరిగాయి. దేశ వ్యాప్తంగా 13,11,544 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. వారిలో 12,58,136 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది ఉంటారని అంచనా. జేఈఈ (మెయిన్‌) పేపర్‌ 2 (బీఆర్క్‌/బీప్లానింగ్‌ ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. నిజానికి గతంలో వంద పర్సంటైల్‌ సాధించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. గతేడాది తొలి విడత మెయిన్‌లో ఏకంగా 20 మందికి వంద పర్సంటైల్‌ రాగా వారిలో 10 మంది రెండు తెలుగు రాష్ట్రాల వారే ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article