దసరా వచ్చిందంటే ప్రతీ ఒక్కరి ఇంట్లో ఘుమఘుమలాడే వాసనలు వస్తూ ఉంటాయి. నాన్ వెజ్ వంటకాలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఈసారి దసరాకు మీ కోసం స్పెషల్గా మటన్ మసాలా కర్రీని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ సారి దసరాకు ఇలా మటన్ మసాలా కర్రీ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీకి తోడు బగారా రైస్ చేసి పెట్టండి. ఇక టేస్ట్ వేరే లెవల్ అంతే. ఈ మటన్ మసాలా కర్రీని తయారు చేయడం కూడా సులభమే. మరి ఈ మటన్ మసాలా కర్రీని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మటన్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు:
మటన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, గసగసాలు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, పెరుగు, ఆయిల్.
మటన్ మసాలా కర్రీ తయారీ విధానం:
ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద గసగసాలు వేసి వేగిన తర్వాత కొబ్బరి పొడి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి కలర్ మానేంత వరకు వేయించుకోవాలి.
ఇవి కూడా చదవండి
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక మటన్ ముక్కలు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు ఉడికించి.. ఆ తర్వాత కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత పది నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు పెరుగు, మసాలా ముద్ద వేసి కలుపుకున్నాక నీళ్లు వేసి గరం మసాలా, కొత్తిమీర వేసి మూత పెట్టి.. 10 నుంచి 11 విజిల్స్ అయినా తెప్పించాలి. వేడి తగ్గాక వాటర్ ఉంటే దగ్గరకు ఇగిరించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ మసాలా కర్రీ సిద్ధం.