RGV : ఆర్జీవిని విచారించనున్న ఒంగోలు పోలీసులు.. ఈసారి వస్తానన్న వర్మ.. ఏం విచారిస్తారో అన్న ఉత్కంఠ.

2 hours ago 2

ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై 2024 నవవంబర్‌ 10వ తేదిన నమోదైన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు… ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే దర్యాప్తు ప్రారంభించారు… విచారణకు గత ఏడాది నవంబర్‌ 19న ఒంగోలు పియస్‌లో హాజరుకావాలంటూ ప్రకాశంజిల్లా పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్ళారు… వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎక్స్‌లో టిడీపీ అధినేత చంద్రంబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం మద్దిపాడు పోలీసులకు 2024 నవంబర్‌ 10న ఫిర్యాదు చేశారు… దీంతో ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై అదేరోజు నవంబర్‌ 10న ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు…

కేసుకు కారణాలు…

వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ రాజకీయాల నేపధ్యంలో రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్‍కు ముందే వివాదాలకు తెరతీసింది. ఎపిలో గత ఎన్నికలకు ముందు రూపొందించిన ఈ సినిమా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతల్ని టార్గెట్‌ చేస్తూ నిర్మించారు… ఈ వ్యూహం సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్లతోనే రాజకీయ దూమారాన్ని రేపింది. తెలుగుదేశం పార్టీ ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది… విడుదలను ఆపాలని తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ సినిమా సెన్సార్‌ను తొలుత తెలంగాణా హైకోర్టు రద్దు చేసింది… అయితే డివిజన్‌ బెంచ్‌లో వర్మ సవాల్‌ చేయడంతో మరోసారి ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్‌బోర్డు యు సర్గిఫికెట్‌ ఇవ్వడంతో సినిమా రిలీజైంది…

దివంగత కాంగ్రెస్‌ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ క్రాష్‌లో చనిపోయిన దగ్గర నుంచి వైయస్‌ జగన్‌ సియం అయ్యే వరకు జరిగిన పరిణామాలను నాటకీయ ఫక్కీలో రాంగోపాల్‌వర్మ తెరకెక్కించారు.. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం, పాదయాత్ర, జగన్‌ జైలుకు వెళ్లడం లాంటి అంశాలను ముడిపెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ సీఎం కావడంతో ఈ సినిమా ముగుస్తోంది… టోటల్‌గా సినిమాలో వైయస్‌ జగన్‌ అధికారం చేపట్టకుండా 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టిడిపి, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కుయుక్తులు పన్నితే ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా వైయస్‌ జగన్‌ ఎలా సియం అయ్యారన్నది సినిమా నేపధ్యంగా చూపించారు… ఈసినిమాలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌, బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాగే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎక్స్‌లో రాంగోపాల్‌వర్మ వీరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశంజిల్లా మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం మద్దిపాడు పియస్‌లో 2024 నవంబర్‌ 10న ఫిర్యాదు చేయడంతో వర్మపై ఐటి యాక్ట కింద కేసు నమోదైంది… దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు…

అసలు వర్మపై కేసేంటి…

ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నవంబర్‌ 10న కేసు నమోదు నమోదైంది… FIR/Case No: 230/2024 u/s 336(4), 353(2), 61(2), 196, 352 BNS, Sec.67 of Information TEchnology Act 2000-2008 ప్రకారం మద్దిపాడు పియస్‌లో కేసు నమోదు చేశారు…

నవంబర్‌ 9వ తేదిన వర్మపై ప్రకాశంజిల్లా మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు… ఎన్నికలకు ముందు వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారాలోకేష్‌ల ఫోటోలు మార్ఫింగ్‌ చేసి మహిళల ఫోటోలకు వీరి తలలు అంటించి అవమానకరంగా పోస్టింగ్‌లు పెట్టారని, వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు… దీంతో నవంబర్‌ 10వ తేదిన కేసు నమోదు చేసిన మద్దిపాడు పోలీసులు, నవంబర్‌ 13న హైదరాబాద్‌లోని వర్మ ఇంటికి వెళ్లి 41A నోటీసులు ఇచ్చారు… నవంబర్ 19న ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు రావాలని ఒంగోలు రూరల్‌ సిఐ శ్రీకాంత్ నోటీసులో పేర్కొన్నారు‌… అయితే నవంబర్‌ 19న విచారణకు రాలేనని, వారం రోజులు గడువు కావాలని సిఐకి వాట్సప్‌ మెసెజ్‌ ఇచ్చి, ఒంగోలులోని తన లాయర్ ఎన్‌. శ్రీనివాసులుద్వారా లిఖిత పూర్వక విజ్ఞప్తి చేయించారువర్మ… దీంతో నవంబర్‌ 20న మళ్లీ రెండోసారి వర్మకు నోటీసులు ఇచ్చారు సిఐ శ్రీకాంత్‌… నవంబర్‌ 25న ఒంగోలురూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని కోరారు… నవంబర్‌ 25న విచారణకు ఒంగోలుకు రాకుంటే BNSS ACT nether Section 35(6) ప్రకారం అరెస్ట్‌ చేస్తామని సమాచారం ఇచ్చారు… అయినా అప్పుడు విచారణకు రాలేదు వర్మ.

విచారణకు వస్తున్నా… వర్మ.

ఈ కేసులో విచారణకు రావాలని గత ఏడాది నవంబర్‌ నెలలో రెండుసార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా వర్మ హాజరుకాలేదు… కొంతకాలం అజ్ఞతంలో ఉండి కోర్టు ద్వారా అరెస్ట్‌ నుంచి తప్పించుకున్నారు… అయితే పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాల్సిందేనని హైకోర్టు సూచించడంతో తాజాగా వర్మను ఫిబ్రవరి 7వ తేదిన విచారణకు ఒంగోలులోని రూరల్‌ పోలీస్ స్టేషన్‌కు రావాలని ప్రకాశంజిల్లా పోలీసులు రాంగోపాల్‌వర్మకు వాట్సప్‌ ద్వారా నోటీసులు పంపించారు… తాను 7వ తేదిన విచారణకు వస్తున్నానని వర్మ పోలీసులకు బదులివ్వడంతో వర్మను ప్రశ్నించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు…

ఏం ప్రశ్నించనున్నారు…

రేపు వర్మ ఒంగోలు రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో హాజరుకానున్న నేపధ్యంలో పోలీసులు విచారణ కోసం పలు ప్రశ్నలను సిద్దం చేసుకున్నారు… వ్యూహం సినిమా టీజర్‌ రిలీజ్‌ చేసిన సమయంలో చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కళ్యాణ్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి రూపొందించి ఎక్స్‌లో పెట్టిన పోస్టులు ఏ ఉద్దేశ్యంతో తయారు చేశారో చెప్పాలని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి… అలాగే ఇలా పోస్టింగ్‌లు పెట్టాలని ఎవరు కోరారో ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నట్టు తెలిసింది… ఈ పోస్టులు, వ్యూహం సినిమా నిర్మాణం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా, ఈ సినిమాకు పెట్టుబడి ఎవరు పెట్టారు అన్న కోణంలో విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశాలున్నాయి… ఓ 50 వరకు ప్రశ్నావళిని రూపొందించుకుని వర్మ కోసం ఒంగోలు రూరల్‌ సిఐ శ్రీకాంత్‌ బాబు ఎదురు చూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article