ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విలేకరుల వసూళ్లకు సంబంధించిన వార్తలు తరచూ చదువుతున్నాం. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం విలేకరుల పేరు చెప్పి లూఠీలకు పాల్పడుతున్నారు. మర్రిగూడ మండలం వట్టిపల్లికి చెందిన తప్పరి రఘు ఓ డిజిటల్ పేపర్లో జిల్లా రిపోర్టర్గా, మాడ్గులపల్లి మండలం పాములపాడుకు చెందిన పేరబోయిన ఆంజనేయులు అలియాస్ అంజి రెండు మండలాలకు రిపోర్టర్గా చలామణి అవుతున్నారు. ఆ డిజిటల్ పత్రిక బ్యూరో ఎడిటర్ ఆనంద్కుమార్ సహకారంతో వీరిద్దరూ జిల్లాలో అధికారులను టార్గెట్గా చేసుకుంటూ.. హల్చల్ చేస్తున్నారు. అధికారులపై నిరాధారమైన కథనాలను రాసి, బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబును లక్ష్యంగా చేసుకుని, ‘వీరగాథ’ పేరుతో వరుస కథనాలను ప్రచురించి, బెదిరింపులకు దిగారు. సీరియల్గా రాస్తున్న కథనాలను ఆపాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.1.10లక్షలు వసూలు చేశారు. అయితే.. సీఐకి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు నిరాధారాలని పోలీసుల దర్యాప్తులో తేలింది. అదే సమయంలో నకిలీ జర్నలిస్టులపై వీరబాబు కూడా మిర్యాలగూడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి రూ.1.10 లక్షలు ఇస్తుండగా రికార్డయిన సీసీకెమెరా ఫుటేజీ, కాల్ రికార్డులను ఆధారాలుగా చూపారు. దీంతో రఘు, ఆంజనేయులు, ఆనంద్కుమార్లపై కేసు నమోదు చేశామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. రఘు, ఆంజనేయులును అరెస్టు చేయగా.. ఆనంద్ కుమార్ పరారీలో ఉన్నాడని తెలిపారు.
ఈ ముఠా ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ నుంచి రూ.50వేల చొప్పున వసూలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని డిఎస్పి చెబుతున్నారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఉన్నాయని, వాటిని పరిశీలించి, కేసులు నమోదు చేస్తామనీ రాజశేఖర్ రాజు అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..