Updated on: Feb 11, 2025 | 5:41 PM
అమెరికా కలలు కంటూ.. తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకొని అగ్రరాజ్యానికి వెళ్లిన వారి ఆశలు అడియాశలయ్యాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. వారి దీనగాథలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ఫిబ్రవరి 5న ప్రత్యేక విమానంలో వెనక్కి పంపింది. తొలివిడతలో 104 మంది సీ-17 గ్లోబ్మాస్టర్ విమానంలో పంజాబ్లోని అమృత్సర్కు చేరుకున్నారు. వీరిని పోలీసులు తనిఖీ చేసి, వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు. వీరిలో కొంతమంది అమెరికా వెళ్లేందుకు తాము పడిన కష్టాలను మీడియాతో పంచుకున్నారు. ఏజెంట్ల మోసంతోనే తాము అక్రమంగా అగ్రరాజ్యానికి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మబలికిన ఏజెంట్కు 42 లక్షల రూపాయలు ఇచ్చి హర్వీందర్ సింగ్ దారుణంగా మోసపోయాడు. ఆయనది పంజాబ్లోని హోషియాపుర్కు చెందిన తహ్లీ గ్రామం. తర్వాత వీసా రాలేదని చెప్పడంతో ఢిల్లీ నుంచి ఖతర్.. అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్లి నానాయాతన పడుతూ అమెరికా వెళ్లాడు.
ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్తో ఉన్న డబ్బు పోయి, ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వచ్చి చేరాడు. ఎలాగోలా బ్రెజిల్ చేరితే తర్వాత పెరూలో విమానం ఎక్కిస్తానని ఏజెంట్ చెప్పాడు కానీ అలాంటి ఏర్పాటు ఏదీ చేయలేదనీ, తర్వాత ట్యాక్సీల్లో కొలంబియా, పనామా తీసుకెళ్లారనీ అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామన్నారన్నాడు. కానీ అలా చేయలేదనీ రెండురోజుల పాటు అక్రమమార్గంలో ప్రయాణించిన తర్వాత పర్వతమార్గంలో ముందుకెళ్లామనీ తమ కష్టాల్ని ఎకరువు పెట్టాడు హర్వీందర్ సింగ్. మెక్సికో సరిహద్దుకు వెళ్లడం కోసం తమను ఒక చిన్న బోటులో కుక్కేశారనీ అందులో నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత బోటు తిరగబడిందనీ దానివల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడనీ అలాగే పనామా అడవిలో మరొకరు చనిపోయారని వాపోయాడు.
మరిన్ని వీడియోల కోసం :