ఓ కారు రయ్యి రయ్యిన దూసుకొస్తోంది.. ఎందుకో దూరం నుంచి చూడగానే.. పోలీసులకు అనుమానం కలిగింది.. వెంటనే.. ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు.. కానీ.. వాళ్లు మాత్రం ఆపేందుకు సిద్ధంగా లేరు.. అదే స్పీడుతో.. పోలీసులను క్రాస్ చేసి దూసుకెళ్లారు.. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.. కారును ఛేజింగ్ చేశారు.. చివరకు కారును ఆపారు.. ఆ తర్వాత డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని చెక్ చేశారు.. కారులో ఉన్న ఎర్రచందనం దుంగలు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని పీలేరు లో చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన స్మగ్లర్తో సహా వాహనము, ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ పీలేరు ఫారెస్ట్ రేంజ్ అధికారి బి.ప్రియాంక సోమవారం తెలిపారు.
ఫారెస్ట్ రేంజ్ అధికారి కథనం ప్రకారం.. పీలేరు-తలపల మార్గం గూండా ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి నుంచి తాము తమ సిబ్బందితో పీలేరు మండలం జాండ్ల గ్రామంలో వాహనాల తనిఖీ చేపట్టామని ప్రియాంక చెప్పారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో తలుపుల గ్రామం నుంచి పీలేరు వైపు వస్తున్న KA09 M 7180 నెంబరు గల మారుతి కారును తాము ఆపినా ఆగకుండా పీలేరు వైపు వేగంగా వెళ్ళిపోయిందని చెప్పారు.
దీంతో తాము ఆ కారును వెంబడించి పీలేరు మండలం గూడరేవుపల్లి గ్రామం వద్ద అడ్డగించి అందులోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకొని కారును తనిఖీ చేయగా అందులో 36 కిలోల బరువు ఉన్న మూడు ఎర్రచందనం దుంగలు లభ్యమయినట్లు తెలపిారు. దీంతో తాము అతనిని అదుపులోకి తీసుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు.
కారులోని వ్యక్తి తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా, కొల్లూరు తాలూకా, నమ్మియం పొట్టు పోస్టు, వల్లియర్ గ్రామానికి చెందిన ఎ.విజయ్ కాంత్(28) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఆపరేషన్లో పీలేరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి సబిహా సుల్తానా, బొంత కనుమలోని బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నట్లు పియాంక వివరించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు లక్ష ఉంటుందని ఆమె తెలిపారు. తాము పట్టుకున్న స్మగ్లరును తిరుపతిలోని ఎర్రచందనం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచామని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..