ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ ప్రెస్మీట్లో వెక్కివెక్కి ఏడ్చారు. పక్కనున్న వాళ్లు ఓదార్చుతున్నా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇటీవల యూపీలో ఓ దారుణ ఘటన జరిగింది. 22 ఏళ్ల దళిత యువతి మృతదేహం లభ్యమవడం సంచలనం సృష్టించింది. నగ్నంగా ఉన్న డెడ్బాడీ దొరకడం స్థానికంగా అలజడి రేకెత్తించింది. తమ కూతురిని అత్యంత దారుణంగా చంపేసి కాలువ పక్కన పడేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమె కళ్లు పీకేశారని, ఒంటినిండా గాయాలున్నాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. “నేనేమీ చేయలేకపోయా..ఆమెని కాపాడలేకపోయా” అని కన్నీళ్లు పెట్టుకున్నారు. పక్కన ఉన్న వాళ్లు ఆయను ఓదార్చే ప్రయత్నం చేశారు. “మీరు కచ్చితంగా పోరాడతారు. ఆమెకి న్యాయం జరిగేలా చూస్తారు” అని ఓదార్చారు. దీనిపై స్పందించిన ఎంపీ అవధేష్..కచ్చితంగా ఈ అంశాన్ని లోక్సభలో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీ వరకూ వెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని వెల్లడించారు. ఇలా జరగకపోతే…రాజీనామా చేసేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు ఎంపీ అవధేష్.
ఇంత ఘోరం జరిగితే ఎలా చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించిన ఎంపీ..అమ్మాయిల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అన్నారు. అంతే కాదు. “ఇంత ఘోరం జరుగుతుంటే..నువ్వెక్కడయ్యా రామయ్య..ఎక్కడమ్మా సీతమ్మా” అని ఆవేదన చెందారు. అయితే..ఎంపీ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలబాదుకుంటూ..గట్టిగా ఏడ్చారు ఎంపీ. ఎలాంటి న్యాయ చేయలేకపోయినందుకు బాధగా ఉందని ఆవేదన చెందారు.
यह जघन्य अपराध बेहद दुःखद हैं।
अयोध्या के ग्रामसभा सहनवां, सरदार पटेल वार्ड में 3 दिन से गायब दलित परिवार की बेटी का शव निर्वस्त्र अवस्था में मिला है, उसकी दोनों आँखें फोड़ दी गई हैं उसके साथ अमानवीय व्यवहार हुआ है।
यह सरकार इंसाफ नही कर सकती। pic.twitter.com/aSvI3N74Kl
— Awadhesh Prasad (@Awadheshprasad_) February 2, 2025
ఏం జరిగిందంటే…?
అయోధ్యలోని ఓ గ్రామంలో మూడు రోజులుగా యువతి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఆ క్రమంలోనే ఓ కాలువ దగ్గర ఆమె మృతదేహం కనిపించింది. చేతులు కాళ్లు కట్టేసి ఉన్నాయని, శరీరంపై పలు చోట్లు లోతైన గాయాలున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె కాలు విరిగిపోయింది. ఆమె డెడ్బాడీని చూసి స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. ఇప్పటికే మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కి పంపించి పోలీసులు..రిపోర్ట్ వచ్చాక పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని వెల్లడించారు. అయితే..పోలీసులు పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ ఆందోళనలు చేపడుతున్నారు. స్థానికులు కూడా పోలీసుల తీరుపై మండి పడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..