భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరో చారిత్రక మైలురాయిని చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్లో కోహ్లీ ఆడనున్నాడు. ఈ సిరీస్లో 94 పరుగులు చేయగలిగితే, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టనున్నారు. ప్రస్తుతం ఈ ఘనత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. 14,000 వన్డే పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న బ్యాట్స్మన్గా కూడా కోహ్లీ నిలిచే అవకాశం ఉంది.
2006లో సచిన్ టెండూల్కర్ తన 350వ ఇన్నింగ్స్లో 14,000 పరుగులు పూర్తి చేశాడు. అయితే కోహ్లీ ఇప్పటి వరకు 283 వన్డే ఇన్నింగ్స్లలో 13,906 పరుగులు సాధించాడు. అంటే కేవలం 94 పరుగులు చేయగలిగితే ఈ ఘనత అతనిదే. కోహ్లీ తన కెరీర్లో 50 వన్డే సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా, ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మన్గా టెండూల్కర్ (49)ను అధిగమించి, 50 సెంచరీలతో రికార్డు నెలకొల్పాడు.
భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. మొదటి మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ, కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్ సహా ఇతర ఆటగాళ్లు నాగ్పూర్కు చేరుకున్నారు. ఈ సిరీస్ అనంతరం ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు జట్టులో ఎక్కువ మార్పులుండకపోవచ్చు. అయితే, మొదటి రెండు వన్డేల కోసం జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఎంపికయ్యాడు.
భారత వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (ఉప-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ఇటీవల ముగిసిన భారత్ vs ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు 4-1తో విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న భారత్, చివరి మ్యాచ్ను గెలిచి మరో విజయంతో సిరీస్ను ముగించింది.
ఇంగ్లాండ్తో ఈ వన్డే సిరీస్ విరాట్ కోహ్లీ అభిమానులకు ఎంతో ప్రాముఖ్యత కలిగినదే. మరి, కోహ్లీ సచిన్ టెండూల్కర్ 14,000 వన్డే పరుగుల రికార్డును బద్దలు కొట్టి మరో చరిత్ర సృష్టిస్తాడా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ వన్డే సిరీస్ కోహ్లీ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందా? అన్నది చూడాలి!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..