అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య చికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి కావడంపై ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తాము అందించిన అంబులెన్సులతో ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోనూ సూద్ మాట్లాడుతూ.. నటుడిగా నాపై ప్రేమ చూపించిన తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు. వైద్య సదుపాయాలు సరిగ్గా లేని ప్రాంతాల కోసం నాలుగు అంబులెన్సులను ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చాం. ఈ అంబులెన్సులు ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వానికి ఉపకరిస్తాయి. కొన్ని జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు ఈ వైద్య సదుపాయం అవసరం అవుతుంది. రహదారులు లేని ప్రాంతాలకు వెళ్లి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నా అని అన్నారు సోనూ సూద్.
తెలుగు ప్రజలు నాకు అత్యంత ఆప్తులు, వారికి ఏదైనా చేయటం నా బాధ్యతగా భావిస్తానాన్న సోనూ సూద్ ఏపీ నాకు రెండో ఇల్లు లాంటిదన్నారు. ఇక్కడి ప్రజల కారణంగానే నేను ఇంతటివాడిని అయ్యానన్న సూద్ అందుకే నాకు ఆంధ్రా అంటే ప్రత్యేక ప్రేమ అని, నా సతీమణి కూడా ఆంధ్రాకు చెందిన తెలుగువ్యక్తేనని అన్నారు. కోవిడ్ సమయంలోనే ప్రజలను ఆడుకోవడంతో నా బాధ్యత మొదలైందన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ఎవరికైనా నేను ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నన్నారు సోనూ సూద్. సమాజానికి మేలు చేయాలన్న విషయంలో సీఎం చంద్రబాబు చాలా మందికి స్పూర్తి అన్నారు. అలాగే తనకు ఎలాంటి రాజకీయపరమైన ఆశలు లేవనీ, నేను సామాన్య వ్యక్తిననీ, ప్రజల మనిషిని అన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనే నన్ను ఇలా నడిపిస్తోందన్నారు. కోవిడ్ సమయం నుంచి సీఎం చంద్రబాబుతో నేను టచ్ లో ఉన్నానన్న సూద్, ఏపీని అభివృద్ధి చేయటంలో నా భాగస్వామ్యం కూడా ఉండాలని అంబులెన్సులను ఇచ్చానన్నారు. సూద్ ఫౌండేషన్ ప్రతీ సామాన్య వ్యక్తికోసం పనిచేస్తోందనీ, అవసరమైతే ప్రభుత్వాలతోనూ కలిసి పనిచేస్తాం అన్నారు. అంబులెన్సులు ఎంత అన్నది ముఖ్యం కాదనీ, ప్రజలతో ఉన్న అనుబంధం ముఖ్యం అన్నారు. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వీటిని ఉపయోగిస్తారని అనుకుంటున్నానాన్న సూద్, ముఖ్యమంత్రి ఒక విజనరీ, సామాన్యుల కోసం చాలా ఆలోచిస్తారనీ ప్రశంసించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కూడా త్వరలోనే కలుస్తాం అన్నారు. ఫతే సినిమా కోసం చాలా సమయం పనిచేశానని, ఇప్పుడు దాని సీక్వెల్ కోసం పనిచేస్తున్నానన్నారు. టాలీవుడ్ లో పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నానన్న సూద్, తెలుగు దర్శక నిర్మాతలకు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నానన్నారు. హీరో, విలన్ కేరక్టర్లు మాత్రమే కాదు నటుడిగా ఏ రోల్ చేసేందుకైనా నేను రెడీ అని అన్నారు సోనూసూద్.