ఫిబ్రవరి సగం నెల కూడా పూర్తి కాలేదు.. అప్పుడే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెలలో వచ్చే శివరాత్రితో చలి శివ శివా అనుకుంటూ వెళ్లిపోతుందని చెబుతారు.. కానీ, చలికాలం పూర్తవకుండానే ఎండలు మండిపోతున్నాయి. మూడు నాలుగు రోజుల నుంచి ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాల్లో 33 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతున్న టెంపరేచర్స్.. ప్రజల్ని టెన్షన్ పెడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక ముందు ముందు ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే రాత్రి ఉక్కపోత, పగలు ఎండతో ప్రజలు బిక్కిరిబిక్కిరి అవుతుండగా, ఫిబ్రవరి చివరి నుంచి ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రతి ఏడాది మార్చి-ఏప్రిల్లో ఎండలు పెరుగుతాయి. ప్రస్తుత ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు 3,4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.. గతేడాదితో పోలిస్తే ఈసారి వేసవిలో ఎండలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు..తూర్పు, ఆగ్నేయ గాలులతో ఎండలు పెరుగుతున్నాయని చెప్పారు. మరోవైపు కర్బన ఉద్గారాలు, పట్టణీకరణ, అడవులు తగ్గడం వంటివి దీనికి కారణం అంటున్నారు.
ఫిబ్రవరి 8న తెలంగాణలోని పలు జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలించినట్టయితే…
తెలంగాణలో మండుతున్న ఎండలు..
– మెదక్..35.8
– భద్రాచలం.. 35.6
– మహబూబ్ నగర్.. 35.6
– ఖమ్మం..35.4
– రామగుండం.. 34.4
– నిజామాబాద్..34.1
– హైదరాబాద్.. 33.5
– ఆదిలాబాద్.. 32.8
– హనుమకొండ.. 34
– నల్లగొండ.. 32
గరిష్టంగా మెదక్ లో 36 డిగ్రీలు, కనిష్టంగా ఆదిలాబాద్ లో 32.3 డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అటు, ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.