రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక మంత్రి సీతారామన్ శనివారం ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ను సమర్పించి మధ్యతరగతి వర్గాల్లో ఆనందం నింపారు. రూ. 12 లక్షల వరకు సాధారణ ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులకు (మూలధన లాభాలు వంటి ప్రత్యేక రేటు ఆదాయం మినహా), స్లాబ్ రేటు తగ్గింపుల నుంచి ప్రయోజనంతో పాటు పన్ను రాయితీ అందిస్తామని తెలిపారు. దీంతో వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ మార్పును ప్రవేశపెట్టడంతో రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన జీతం పొందే వ్యక్తులు కొత్త పన్ను విధానంలో జీరో ట్యాక్స్ శ్లాబ్లో ఉంటారు అయితే వారు పన్ను బాధ్యత లేని ఇతరులతో కలిసి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయవలసి ఉంటుందా? అనే విషయంలో చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత పన్ను విధానంలో రూ. 2.5 లక్షలు, కొత్త పన్ను విధానంలో రూ. 4 లక్షలు, ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించి ఆదాయం ఉన్న వ్యక్తులకు ఐటీఆర్ దాఖలు తప్పనిసరి నిబంధనలు చెబుతున్నాయి.
ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ బాధ్యతలు ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటాయి. పన్ను బాధ్యతపై కాదని ట్యాక్స్ నిపుణులు అంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే రాయితీలు లేదా తగ్గింపుల కారణంగా పన్ను చెల్లింపుదారుల బాధ్యత సున్నాకి వచ్చినప్పటికీ వారు తప్పనిసరిగా వారి జీరో ట్యాక్స్ను చూపిస్తూ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడం అనేది క్లీన్ ఫైనాన్షియల్ రికార్డ్ను నిర్వహించడంలో సహాయపడుతుంది. అలాగే రుణాలు, వీసాలు లేదా ఇతర ఆర్థిక సేవలను పొందడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి