మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. వసంత పంచమి సందర్భంగా భక్తులు భారీ స్థాయిలో పోటెత్తుతున్నారు. ఈ రద్దీకి తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో నిత్యం లక్షలాది మంది ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడికి వీఐపీల తాకిడి కూడా బలంగానే ఉంది...
Maha Kumbh Mela
ఇప్పటి వరకూ మహా కుంభమేళాకి 35 కోట్ల మంది వచ్చారని అధికారులు వెల్లడించారు. మౌని అమావాస్యతో పాటు వసంత పంచమి కారణంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని తెలిపారు. ఇవాళ (ఫిబ్రవరి 3వ తేదీ) ఉదయం 8 గంటల సమయానికి కేవలం ఒక్కరోజులోనే దాదాపు 62 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాకు వచ్చారు. చరిత్రలో ఒక్కరోజులోనే కుంభమేళాకు ఇంత మంది ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు అధికారులు. ఈ సారి రికార్డు స్థాయిలో రద్దీ నెలకొంది. మహా కుంభమేళాకి మరో 23 రోజుల సమయం ఉంది. మిగిలిన ఈ రోజుల్లో కనీసం మరో 5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కేవలం దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈ సారి ఎక్కువగా తరలి వస్తుండడం విశేషం. ఫిబ్రవరి 2వ తేదీన దాదాపు కోటి 20 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.
మౌని అమావాస్య రోజున దాదాపు 8 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు అధికారులు వెల్లడించారు. మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30వ తేదీన రెండు కోట్ల మంది భక్తులు వచ్చారు. పౌష్య పూర్ణిమ రోజున కోటి 70 లక్షల మంది హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ సమయంలోనే త్రివేణి సంగమంలో నదీ స్నానం చేశారు. అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు తెచ్చుకున్న మహా కుంభమేళాకు వెళ్లడం ఎంతో పుణ్యమని విశ్వసిస్తారు భక్తులు. ముఖ్యంగా ఆ సమయంలో నదీ స్నానం ఆచరించడం ఉత్తమమని భావిస్తారు. ఈ ఏడాది జనవరి 13వ తేదీన మొదలైన మహా కుంభమేళా..ఫిబ్రవరి 26వ తేదీ వరకూ కొనసాగనుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్న ఈ ఉత్సవం..రాబోయే రోజుల్లో మరెన్నో రికార్డులు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. యోగి సర్కార్ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాట్లు చేసింది. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..