Team India: T20 వరల్డ్ కప్ ఆటగాళ్లకు డైమండ్ రింగ్స్ ఇచ్చిన BCCI! ఇవి చాల స్పెషల్ గురూ

3 hours ago 2

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2024 T20 ప్రపంచ కప్ విజేత భారత జట్టుకు ప్రత్యేక గౌరవాన్ని అందించింది. ముంబైలో జరిగిన నామన్ అవార్డ్స్ 2025 వేడుకలో, కెప్టెన్ రోహిత్ శర్మ సహా భారత జట్టు సభ్యులకు వజ్రాలతో కూడిన కస్టమైజ్డ్ “ఛాంపియన్స్ రింగులు” బహుమతిగా ఇవ్వబడ్డాయి. NBA, NFL లాంటి అమెరికన్ స్పోర్ట్స్ లీగ్‌లను అనుసరించి, ఈ ఉంగరాల్లో ఆటగాళ్ల పేర్లు, జెర్సీ నంబర్లు, మధ్యలో అశోక్ చక్రంతోపాటు “ఇండియా T20 వరల్డ్ ఛాంపియన్స్ 2024” అనే పదాలు చెక్కబడి ఉన్నాయి.

గత ఏడాది బార్బడోస్‌లో జరిగిన అద్భుతమైన ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇది భారత్ సాధించిన తొలి మెగా టైటిల్ కావడం విశేషం. “T20 వరల్డ్ కప్ లో వారి అపరాజిత ప్రయాణాన్ని గౌరవించేందుకు టీం ఇండియాకు ఛాంపియన్స్ రింగులను అందిస్తున్నాము. వజ్రాలు శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ ఈ విజయం భారత అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది” అంటూ BCCI ఓ వీడియో విడుదల చేసింది.

ఈ గెలుపుతో పాటు, భారత క్రికెట్‌లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఫైనల్ అనంతరం, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తమ T20I రిటైర్మెంట్‌ను ప్రకటించారు. వారితో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

“ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్, మేము సాధించాలనుకున్నది ఇదే. ఒక రోజు మీరు పరుగులు చేయలేరని అనుకున్నప్పుడు, దేవుడు ఒక మంచి క్షణాన్ని మీకు అందిస్తాడు. నేను జట్టుకు అవసరమైన సమయంలో పని పూర్తి చేశాను” అంటూ కోహ్లీ భావోద్వేగంగా స్పందించాడు. “ఇది నా చివరి T20I మ్యాచ్. నా కెరీర్‌ను ఈ ఫార్మాట్‌లోనే ప్రారంభించాను. ప్రపంచ కప్ గెలవాలన్నది నా జీవితాశయం. చివరికి మేము గీత దాటినందుకు సంతోషంగా ఉంది” అని రోహిత్ శర్మ అన్నాడు.

ఈ గెలుపు భారత క్రికెట్‌కు మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానులకు కూడా ఒక గొప్ప సందర్భంగా నిలిచింది. ఒక దశలో దక్షిణాఫ్రికాకు 30 పరుగులు మాత్రమే అవసరమైనా, భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు కన్నీళ్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ, “మేము ప్రపంచ కప్ గెలిచామన్న విషయం నాకు ముంబైకి వచ్చే వరకు పూర్తిగా అర్థం కాలేదు. బార్బడోస్‌లో హరికేన్ కారణంగా బయటకు వెళ్ళలేకపోయాం. సాధారణంగా ఇలాంటి విజయాల తర్వాత దేశానికి ట్రోఫీ తీసుకెళ్లి అభిమానులతో కలిసి జరుపుకోవాలనుకుంటాం. అయితే మేము అక్కడే కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది” అని చెప్పాడు.

2013 తర్వాత ఇది భారత క్రికెట్‌కు మరో గొప్ప విజయం. అంతేకాకుండా, 2023 ODI ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయిన తర్వాత, అదే భారత జట్టు అద్భుతంగా పుంజుకుని ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ప్రత్యేకతను అందించింది. 2026 T20 ప్రపంచ కప్ కోసం కొత్త జట్టు, కొత్త నాయకత్వంతో భారత క్రికెట్ ముందుకు సాగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article