Telangana: భార్యపై అనుమానం.. ఆమెను వదిలించుకునేందుకు భర్త పెద్ద స్కెచ్.. అప్పుడే అసలు ట్విస్ట్!

1 hour ago 1

అనుమానం పెనుభూతం అంటారు. ఆ అనుమానమే నిండు జీవితాన్ని బలి తీసుకుంది. భర్త అనుమానం వల్ల, ప్రేమించి, పెళ్ళి చేసుకున్న పాపానికి ఓ మహిళ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. భార్యను వదిలించుకునేందుకు భర్త పక్కా ఫ్లాన్ వేశాడు. ఆ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల వద్ద భర్త కట్టుకథలు పనిచేయలేదు.. చివరికి కటకటాల పాలయ్యాడు.

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లుకు చెందిన పేరబోయిన సైదులు, మిర్యాలగూడకు చెందిన కుమ్మరి అనూషలు 16 ఏళ్ల కిందట ప్రేమించి, పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. అనూష రావువారిగూడెంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. సైదులు కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అనూష.. రావూరి గూడెంతో పాటు కామేపల్లి గ్రామంలో ఇన్‌చార్జి అంగన్‌వాడీ టీచర్‌గా కూడా పనిచేస్తుంది.

భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సైదులు కొన్నాళ్లుగా ఆమెను మాటలతో వేధించడమే కాకుండా, కొడుతూ హింసపెడుతున్నాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పుకోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీ పెట్టి హెచ్చరించినా సైదులు ప్రవర్తన మార్పు రాలేదు. పైగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఏకంగా ఆమెను పర్మినెంట్‌గా వదిలించేందుకునేందుకు పెద్ద స్కెచ్ వేశాడు.

పక్కా ప్లాన్ తో…

ఈ క్రమంలో భర్త సైదులు ఆమైపై మరింత అనుమానం పెంచుకున్నాడు. అక్టోబర్ 5వ తేదీన అనూషను కామేపల్లి గ్రామంలో దించి సైదులు తిరిగి ఇంటికి వచ్చాడు. అక్కడ స్కూల్‌ ముగిసిన తర్వాత తిరిగి తనను తీసుకెళ్లాలని సైదులుకు అనూష ఫోన్‌ చేసింది. ఎలాగైనా అనూషను హతమార్చాలని స్కెచ్ వేసిన సైదులు, తనకు లేటవుతుందని అక్కడే కొద్దిసేపు ఉండమని భార్యకు చెప్పాడు. చీకటి పడిన తర్వాత కామేపల్లికి చేరుకున్న సైదులు అనూషను బైక్‌పై ఎక్కించుకుని రావులపెంట గ్రామ శివారులో గల నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్లాడు. అక్కడే అనుకున్న ఫ్లాన్ అమలు చేశాడు. బైక్‌ ఆపి అనూషను తీవ్రంగా కొట్టి కాల్వలోకి తోసేశాడు. ఆ తర్వాత బైక్‌ను కాలువలోకి తోసి, తాను కూడా కాలువలో దూకి ఈదుకుంటూ బయటకు వచ్చాడు.

అప్పుడూ అసలు నాటకం షురూ చేశాడు.. ప్రమాదవశాత్తు బైక్‌తో పాటు కాల్వలో పడిపోయామని, తన భార్య గల్లంతైందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాల్వలో గల్లంతైన అనూష మృతదేహం గరిడేపల్లి మండలం పొనుగోడు రిజర్వాయర్‌ కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అల్లుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మృతురాలి తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైదులును అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తానే కాల్వలోకి తోసేసినట్లు అంగీకరించాడు. దీంతో సైదులును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article