తిరుమల పవిత్రతే లక్ష్యం.. భక్తుల మనోభావాలే ముఖ్యం.. అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది.. ఈ క్రమంలోనే.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొండపై అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభించింది. 18మంది అన్యమత ఉద్యోగులను గుర్తించి వారికి మెమోలివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కొంతమంది అన్యమత ఉద్యోగులు తిరుమల పవిత్రను దెబ్బతీస్తున్నారంటూ టీటీడీ పేర్కొంటోంది.. గత ఏడాది నవంబర్ 18న నిర్ణయించిన తీర్మానం ప్రకారం.. హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి ఉద్యోగం పొందిన కొందరు… అన్యమతాన్ని ప్రోత్సాహిస్తున్నారంటూ చర్యలు ప్రారంభించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అదేశాలతో టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభించారు ఉన్నతాధికారులు..
ఇతర మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూనే… టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.
సదరు ఉద్యోగులు టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని బీఆర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. దీని ప్రకారం.. టీటీడీ అధికారులు 18 మంది ఉద్యోగులకు మెమో జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..