Champions Trophy: పాకిస్తాన్ పర్యటనకు ప్లేయర్లే కాదు అంపైర్ కూడా ఛీ కొడుతున్నాడు భయ్యా! ఇంతకీ అయన ఎవరో తెలుసా?

2 hours ago 1

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారతదేశానికి చెందిన ఏకైక ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ నితిన్ మీనన్, వ్యక్తిగత కారణాల వల్ల ఈ టోర్నమెంట్‌లో అంపైరింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌లోని కరాచీలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభంకానుండగా, మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఐసీసీ ఈ టోర్నీ కోసం 15 మంది మ్యాచ్ అధికారుల జాబితాను బుధవారం విడుదల చేసింది.

ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం మూడు వేదికలైన కరాచీ, లాహోర్, రావల్పిండిలలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా, భారత్ తన మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో కాకుండా దుబాయ్‌లో ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది.

నితిన్ మీనన్ ఎందుకు తప్పుకున్నాడో స్పష్టత లేదు:

ఐసీసీ, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నితిన్ మీనన్‌ను అంపైర్ల జాబితాలో చేర్చాలని అనుకున్నప్పటికీ, అతను వ్యక్తిగత కారణాల వల్ల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లకుండా నిర్ణయించుకున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే, అధికారికంగా ఐసీసీ ఈ అంశంపై ఎటువంటి వ్యాఖ్యానాన్ని చేయలేదు. ఐసీసీ తటస్థ అంపైర్ల నియామక విధానాన్ని అనుసరించే కారణంగా, దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లలో కూడా మీనన్ అంపైరింగ్ చేయలేడు.

ఈ టోర్నమెంట్‌కు ఎంపికైన మూడు మ్యాచ్ రిఫరీలు క్రికెట్‌లో భారీ అనుభవం ఉన్నవారే. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ బూన్, శ్రీలంక దిగ్గజ అంపైర్ రంజన్ మడుగలే, జింబాబ్వేకు చెందిన ఆండ్రూ పైక్రాఫ్ట్‌లను ఐసీసీ మ్యాచ్ రిఫరీలుగా నియమించింది.

12 మంది అంపైర్లతో కూడిన ప్యానెల్‌ను ఐసీసీ ప్రకటించింది. గతంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను అంపైర్ చేసిన రిచర్డ్ కెటిల్‌బరో ఈసారి కూడా ఈ టోర్నీలో భాగమయ్యాడు. అలాగే, క్రిస్ గఫానీ, కుమార్ ధర్మసేన, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, పాల్ రీఫెల్, రాడ్ టక్కర్, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, అహ్సాన్ రజా, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్‌లకు అంపైరింగ్ బాధ్యతలు అప్పగించారు.

ధర్మసేన సరికొత్త రికార్డ్

ఈ టోర్నమెంట్‌లో శ్రీలంక అంపైర్ కుమార్ ధర్మసేన 132వ వన్డేకు అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఇది వన్డే క్రికెట్‌లో శ్రీలంక తరఫున అంపైర్‌గా కొత్త రికార్డుగా నిలవనుంది.

ఐసీసీ అంపైర్లు, రిఫరీల విభాగం సీనియర్ మేనేజర్ సీన్ ఈసీ మాట్లాడుతూ, “ఐసీసీ ఎల్లప్పుడూ అత్యుత్తమ అధికారులను నియమించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్యానెల్ పాకిస్తాన్, దుబాయ్ రెండింటిలోనూ అత్యుత్తమ సేవలను అందిస్తుందని మేము నమ్ముతున్నాము. ఈ టోర్నమెంట్ చిరస్మరణీయంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాము” అని అన్నారు.

మ్యాచ్ అధికారుల జాబితా:

అంపైర్లు: కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గౌఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, అహ్సాన్ రజా, పాల్ రీఫెల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్.

మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article