ఆ దొంగ అలాంటి ఇలాంటి దొంగ కాదు.. వారం లో ఎన్ని రోజులున్నా ఆ ఒక్కరోజు మాత్రమే పూనకాలు వచ్చేస్తాయి.. ఆ వారం వచ్చిదంటే చాలు అర్ధరాత్రి అమాంతంగా తన చోర కళ బయటపడుతుంది. అలాంటి ఓ దొంగను ఆ జిల్లా పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. ఆ దొంగ చోరీ చేసిన విధానాన్ని.. వారం సెంటిమెంట్ ను తెలుసుకుని ఆ జిల్లా పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదేదో అచ్చంగా.. సరిపోదా శనివారం సినిమాను పోలినట్టుందే అనుకుంటున్నారు..? కదా.. అచ్చం అలాంటి కథనే.. కానీ అక్కడ హీరో రౌడీలను కొట్టేందుకు ఆ వారాన్ని ఉపయోగించుకుంటే.. ఇక్కడేమో ఈ ఘనుడు చోరీల కోసం శనివారాన్ని ఉపయోగించుకున్నాడు.. ఆ చోర శిఖామణి ఎవరు..? అతను గురించి క్లియర్ కట్ గా తెలుసుకోవాలంటే నిర్మల్ జిల్లాలో జరిగిన శనివారం దొంగ తనాల హిస్టరీ రివీల్ చేయాల్సిందే..
నిర్మల్ జిల్లా భైంసాలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో దొంగను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ ఆలయాల్లో చోరి చేసిన వెండి, బంగారు అభరణాలను సైతం స్వాధీనపర్చుకున్నారు. చోరికి సహకరించిన నిందితుడి భార్యతో పాటు చోరి సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో ఆశ్చర్యం కలిగించే విషయాలను తెలుసుకున్నారు నిర్మల్ జిల్లా పోలీసులు..
గత కొన్ని రోజులుగా భైంసా పట్టణంలోని దేవాలయాలలో వరుస చోరీలు జరగడం.. ఆ చోరీలుకూడా శనివారాలే జరగడంతో ప్రత్యేక నిఘా పెట్టారు బైంసా పోలీసులు.. ఇంతలోనే గత శనివారం మరో చోరీ జరగడంతో.. శనివారానికి దొంగకు లింక్ ను గుర్తించి.. వరుస చోరీలకు పాల్పడింది ఒకరే అని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఓ ఆలయంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. బైంసా సమీపంలో నిందితున్ని వల పన్ని పట్టుకున్నారు. చోరికి సహకరించిన నిందితుడి భార్యతో పాటు చోరి సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. భైంసాలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిలా, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విజయ్ శింఢే అలియాస్ అశోక్ (36) అనే వ్యక్తి కొంత కాలం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ బలరాంపూర్ లో నివాసముంటూ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే మకాం మార్చాడు.. గత కొంత కాలంగా భైంసా పట్టణలోని నర్సింహా స్వామి ఆలయం, పూలే నగర్ హనుమాన్ మందిర్, సంతోషిమాత మందిర్, కైలాస్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ బాలాజీ దేవాలయంతో పాటు నిర్మల్ రోడ్డు మార్గంలోని హిమా వైన్స్ లో వరుసగా చోరీలకు పాల్పడ్డాడు. ఎలాంటి ఆచూకీ, ఆనవాళ్లు దొరకకుండా చాకచాక్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టుకునేందుకు గాను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినిగియోంచి కేసును చేధించినట్లుగా తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానంతో దొంగతనాలకు పాల్పడుతున్న విజయ్ శింఢేను గుర్తించి అదుపులోకి తీసుకోగా.. భైంసాలో నాలుగు ఆలయాలతో పాటు హిమా వైన్స్ లో చోరికి పాల్పడ్డట్టుగా అంగీకరించాడు.. దీంతో పోలీసులు అతనిని విచారించగా.. ఆలయాల్లో చోరి చేసిన వెండి, బంగారు అభరణాలను విక్రయించేందుకు గాను ఆయన భార్య పూజా శింఢే, మహారాష్ట్రకు చెందిన వెండి వ్యాపారి పాండురంగ్ రామారావు సహకరించినట్లుగా వెల్లడించారు. వారి వద్ద నుంచి చోరికి పాల్పడిన 3కిలోల 150 గ్రాముల వెండి సొత్తు, భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం చోరికి పాల్పడిన నిందితుడు విజయ్ శింఢేను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా ఎస్పీ జానకీ షర్మిలా వివరించారు. ఇదే ఘటనలో భాగస్వామ్య ఉన్న మిగతా ఇద్దరిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ నేతృత్వంలో భైంసా టౌన్ సీఐ గోపినాథ్, ఎస్సై శ్రీనివాస్ యాదవ్ లు చాకచాక్యంగా వ్యవహారిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో కేసును చేధించడంలో సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..