హైదరాబాద్, ఫిబ్రవరి 7: తెలంగాణ రాష్ట్రంలో టెట్-2024 రెండో విడత పరీక్షలు గత నెలలో ఆన్లైన్ విధానంలో నిర్వహించగా తాజాగా వాటి ఫలితాలు విడుదలయ్యాయి. రెండు పేపర్లు కలిపి 83,711 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 31.21 శాతం మంది మాత్రమే టెట్లో ఉత్తీర్ణత పొందారన్నమాట. నిజానికి టెట్ డిసెంబర్ 2024 సెషన్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,05,278 మంది పరీక్ష రాశారు. రెండు పేపర్లలో సగటున 40.78 శాతం మంది కనీస మార్కులు సాధించారు. వీరంతా త్వరలో విడుదల చేయనున్న డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించారు.
ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్-1, ఉన్నత పాఠశాలల్లో (6-10 తరగతులు) బోధనకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పేపర్-2లో గణితం, సైన్స్; సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. టెట్లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఒకసారి పాసైతే ఆ స్కోర్కు జీవితకాలం గుర్తింపు ఉంటుంది. అందుకే టెట్ నోటికేషన్ వచ్చిన ప్రతీసారి మార్కులు పెంచుకునేందుకు అభ్యర్థులు అధిక శాతం మళ్లీ మళ్లీ పరీక్ష రాస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తొలుత టెట్ ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. అయితే టెట్ ఫలితాలతో నేరుగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ తర్వాత ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో విద్యాశాఖ టెట్ ఫలితాలను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అగ్రివర్సిటీలో పీహెచ్డీ కౌన్సెలింగ్ షురూ..
ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఫిబ్రవరి 5న మొదలైన సంగతి తెలిసిందే. రిజిస్ట్రార్ విద్యాసాగర్ రాజేంద్రనగర్లోని వాటర్ టెక్నాలజీ సెంటర్లో దీనిని ప్రారంభించారు. నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా విద్యార్ధులకు కౌన్సెలింగ్లో సీట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.