వైసీపీ నేత, మాజీ మంత్రి విడుదల రజినీపై రెండు వారాల్లోగా కేసు నమోదు చేయాలి…! దర్యాప్తు జరిపి నిజానిజాలు తేల్చాలి..! కేసు వివరాలన్నింటినీ సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు… రజినీపై కేసు నమోదుకు ఆదేశాలివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు పిల్లి కోటి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను విడుదల రజినీ ఎన్నో ఇబ్బందులు పెట్టారని అన్నారు. తనని చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలను లైవ్లో చూస్తూ రజిని పైశాచిక ఆనందం పొందినట్లు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే చంపేస్తామని నాడు బెదిరింపులకు దిగారని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు విడుదల రజనీ, ఆమె పీఏలు రామకృష్ణ, ఫణీంద్ర, అప్పటి చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గతంలోనూ పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావును కోరినట్లు వెల్లడించారు. కానీ రజినీపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించాడు. ఇక పిల్లి కోటి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు… రెండు వారాల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని తీసుకుని ఎస్పీ శ్రీనివాసరావును మరోసారి కలిశారు పిల్లి కోటి. ఉత్తర్వులు పరిశీలించిన ఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా… హైకోర్టు ఆదేశాలపై విడుదల రజినీ ఎలా రియాక్టవుతారు..? కేసు నమోదు విషయంలో పోలీసుల ఎలా వ్యవహరిస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు పొలిటికల్గానూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోందీ ఇష్యూ. మరి చూడాలి ఏం జరుగుతుందో…!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..