ఉచిత పథకాలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు ఉచితాలను తప్పుబట్టిన ధర్మాసనం.. ఉచిత పథకాలతో ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటంలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.. ఏ పనీచేయకుండా ఆహారం,డబ్బు సంపాదిస్తున్నారు.. లబ్ధిదారులను పరాన్నజీవులుగా మారుస్తున్నారంటూ సుప్రీం కోర్టు రాజకీయ పార్టీలను తీవ్రంగా విమర్శించింది. బుధవారం విచారణ సందర్భంగా ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటీషన్కు సంబంధించిన కేసును విచారిస్తున్నప్పుడు, ఎన్నికలకు ముందు ఉచితాలను అందించే పద్ధతిని జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యతిరేకించిందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
“ఉచిత పథకాలు మంచివి కావు..దురదృష్టవశాత్తు, ఈ ఉచితాల కారణంగా… ప్రజలు ఏ పని చేయడానికి ఇష్టపడటం లేదు. వారికి ఉచితంగా రేషన్, డబ్బులు అందుతున్నాయి. వారు ఎటువంటి పని చేయకుండానే ఈ మొత్తాన్ని పొందుతున్నారు.. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే.. కానీ, వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలి. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదు’’ అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నిరాశ్రయులైన వారిని ప్రధాన స్రవంతి సమాజంలో చేర్చాలని.. దేశాభివృద్ధికి దోహదపడటానికి అనుమతించాలని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది.
“వారి పట్ల మీకున్న శ్రద్ధను మేము చాలా అభినందిస్తున్నాము, కానీ వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేసి, దేశాభివృద్ధికి దోహదపడటానికి అనుమతించడం మంచిది కాదా” అని ధర్మాసనం పేర్కొంది.
కేంద్రప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ను పూర్తి చేసే పనిలో ఉందని.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు యోచిస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ఈసందర్భంగా ధర్మాసనానికి తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ నిర్మూలన మిషన్ ఎంతకాలం పాటు పని చేస్తుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ను మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని వాయిదా వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..