ప్రాణాంతక జబ్బులతో బాధపడుతూ లైఫ్ సపోర్ట్తో కూడా కోలుకోని రోగులు ‘గౌరవంగా చనిపోయే హక్కు’ను కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హక్కును ప్రసాదించే ముందు రెండు దశల్లో మెడికల్ రివ్యూ ఉంటుంది. ప్రాథమిక బోర్డులోని ముగ్గురు వైద్యులు రోగి పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అంతేమంది వైద్యులతోపాటు ప్రభుత్వం నియమించిన వైద్యుడితో కూడిన సెకండరీ బోర్డు కోర్టుకు నివేదిక సమర్పించడానికి మొదటి బోర్డు గుర్తించిన అంశాలను పరిశీలిస్తుంది.
ఆ నివేదికను పరిశీలించిన కోర్టు.. దీనికి అంగీకరిస్తే వైద్య నిపుణుల పర్యవేక్షణలో రోగి లైఫ్ సపోర్ట్ను తొలగించి అతడు ప్రశాంతంగా చనిపోయే అవకాశం కల్పిస్తారు. అయితే, సంబంధిత రోగి బంధువులు కోరిన మీదటే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కోలుకోలేని రోగులకు దీర్ఘకాలిక బాధల నుంచి విముక్తి కల్పించడంపై దృష్టి పెట్టిన సుప్రీంకోర్టు.. ఇలాంటి వారికి గౌరవప్రదంగా చనిపోయే హక్కును కల్పించాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండురావ్ ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. కోలుకోలేని ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్న రోగులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఇది చాలా ముఖ్యమైన అడుగు అని, దీని వల్ల చాలా కుటుంబాలు, వ్యక్తులకు గొప్ప ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.