నిర్ణీత పరిమితికి మించిన ఆదాయం సంపాదించే దేశంలోని పౌరులందరూ ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించాలి. అయితే వారికి ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించి కొన్ని మినహాయింపులు లభిస్తాయి. ప్రస్తుతం పాత, కొత్త విధానాల్లో ఆదాయపు పన్ను చెల్లింపులు చేయవచ్చు ఏ విధానంలో ఎక్కువ మినహాయింపు లభిస్తుందో లెక్కించుకుని నిర్ణయం తీసుకోవాలి. కొత్త విధానంలో ఏడాదికి రూ.12.75 లక్షల వరకు సంపాదించేవారు (రూ.75 వేల ప్రామాణిక తగ్గింపుతో సహా) 2025-26 ఆర్థిక సంవత్సరంలో సున్నా పన్ను చెల్లిస్తారు. అయితే ఈ విధానంలో రూ.75 వేల ప్రామాణిక మినహాయింపు ఉన్నప్పటికీ పెట్టుబడులకు తగ్గింపులు లేవు. ఒక వేళ ఆర్థిక సంవత్సరంలో రూ.12.75 లక్షల ఆదాయం దాటితే మొత్తం ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. ఎటువంటి తగ్గింపులు ఉండవు. ఎటుకంటే ఈ విధానంలో హెచ్ఆర్ఏ, ఈఎల్ఎస్ఎస్, ఐదేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్, ఎన్పీఎస్ తదితర వాటిని క్లెయిమ్ చేసుకునే వీలుండదు.
బడ్జెట్ లో పాత పన్ను విధానాన్ని మార్చలేదు. దీనిలో రిబేటు కారణంగా రూ.5 లక్షల వరకూ ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. అలాగే ఈ విధానంలో సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎల్ఐసీ ప్రీమియాలకు రూ.1.50 లక్షల వరకూ మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 24(బి) ప్రకారం రూ.2 లక్షల వరకూ హౌసింగ్ రుణంపై వడ్డీని మినహాయింపు లభిస్తుంది. వీటితో పాటు హెచ్ఆర్ఏ, ఎల్టీఏ తదితర ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
ఆదాయపు పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏడాదికి రూ.12.75 లక్షల వరకూ సంపాదించే వారికి కొత్త ఆదాయపు పన్ను విధానం చాలా బాగుంటుంది. అంతకంటే ఎక్కువ సంపాదించే వారుమాత్రం తమ పెట్టుబడులు, ఇతర తగ్గింపులను లెక్కించుకోవాలి. పాత విధానంలో వచ్చే మినహాయింపులను పరిగణనలోకి తీసుకోవాలి. ఏ విధానంలో ఎక్కువ మినహాయింపు ఉంటుందో గమనించి, దాని ప్రకారం పన్ను చెల్లించాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి