అమరావతి, ఫిబ్రవరి 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్టు ఏపీ ఐటీశాఖమంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించానన్నారు. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించామని, విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలనికోరినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీసినట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తమ ప్రభుత్వం 20లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ సేవలు, గ్రీన్ హైడ్రోజన్, రెన్యువబుల్ ఎనర్జీ విస్తరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా పలువురిని కలుస్తామని అన్నారు. ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకే ప్రశాంత్ కిశోర్ను కలిశామని, గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు భారీగా తగ్గారని మంత్రి లోకేష్ అన్నారు. ఐదేళ్లలో పాఠశాలల్లో చదివే విద్యార్ధులు 45 లక్షల నుంచి 32 లక్షలకు తగ్గినట్లు లోకేశ్ మీడియాకు వివరించారు.
తెలంగాణ ‘టాస్’ పరీక్షల ఫీజు గడువు ఫిబ్రవరి 13 వరకు పెంపు
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పరిధిలో ఏప్రిల్ నెలలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు చెల్లించవల్సిన ఫీజు గడువును పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు రూ.50 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని టాస్ సంచాలకుడు పీవీ శ్రీహరి ఓ ప్రటకనలో తెలిపారు. తత్కాల్ కింద ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.